ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా అమెరికాతో వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో టీమిండియా 29 పరుగుల తేడాతో గెలుపొందింది. పసికూన అమెరికా నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైనా.. సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్, బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా.. బ్యాటింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 84 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాక్విక్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. హర్మీత్ సింగ్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్(1/13), మహమ్మద్ మోహ్సిన్(1/16) తలో వికెట్ తీసారు.
అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసి ఓటమిపాలైంది. మిలింద్ కుమార్(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34), సంజయ్ కృష్ణమూర్తి(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/29) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/22), అర్ష్దీప్ సింగ్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తీ ఒక వికెట్ దక్కింది.

162 పరుగుల లక్ష్యఛేదనలో అమెరికాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన ఆండ్రీస్ గౌస్.. అదే ఓవర్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన మరుసటి ఓవర్లో యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్(0) డకౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సాయితేజ ముక్కమల్ల(2)ను సిరాజ్ తన రెండో ఓవర్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో అమెరికా 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి అమెరికాను ఆదుకున్నారు. భారీ షాట్లతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. నాలుగో వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. ఇషాన్ కిషన్ సాయంతో మిలింద్ కుమార్ను స్టంపౌట్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న సంజయ్ కృష్ణమూర్తిని ఔట్ చేసిన అక్షర్ పటేల్.. మరుసటి బంతికే హర్మీత్ సింగ్(0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. చివర్లో దూకుడుగా ఆడిన శుభమ్ రంజన్ను ఆఖరి బంతికి సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.