ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న సూపర్-8 పోరులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తెలిపాడు. ఇది భిన్నమైన వికెట్ అని పేర్కొన్నాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. వికెట్ చూడటానికి బాగుంది. ఇక్కడ మేం ఇప్పటికే కొన్ని మ్యాచ్లు ఆడాం. పిచ్ కొంచెం జిగటగా కనిపిస్తోంది. బౌలింగ్కు కాస్త అడ్వాంటేజ్గా ఉండనుంది. దానిని మేం సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇక్కడ కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం రావడం మా అదృష్టం.
ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మేం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం. కగిసో రబడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తగిన సలహాలు ఇస్తున్నాడు. అతనికి ఈ వేదికపై ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.
'కేవలం బోర్డుపై పరుగులు ఉంచడమే మా లక్ష్యం. ఒకవేళ మేం టాస్ గెలిచి ఉంటే మొదట బౌలింగ్నే ఎంచుకునేవాళ్లం. జట్టులో ఒక మార్పు చేశాం. అఖీల్ హోసేన్ స్థానంలో రోస్టన్ ఛేజ్ జట్టులోకి వచ్చాడు. ఇది కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమే. అఖీల్ చాలా బాగా ఆడుతున్నాడు. అతన్ని జట్టు నుంచి తప్పించ లేదు. మేం ఇప్పటివరకు మంచి క్రికెట్ ఆడాం. ఈ మ్యాచ్ కోసం కుర్రాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు.'అని హై హోప్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. అప్పుడే భారత్ రన్రేట్తో సంబంధం లేకుండా చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. దాంతోనే సౌతాఫ్రికా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్.
సౌతాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కోర్బిన్ బాష్, కాగిసో రబడా, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి.