Sanjay Manjrekar: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.4500 కోట్ల వ్యాపారం దెబ్బతింటుందని బిజినెస్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తుండగా.. టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈ మ్యాచ్ జరగకపోయినా ఒరిగేదేం లేదన్నాడు.
పాకిస్థాన్ జట్టు ఒకప్పటిలా లేదని, బలహీనంగా మారిందని చెప్పుకొచ్చాడు. బలమైన భారత జట్టు ముందు పాకిస్థాన్ తేలిపోతుందని, ఒకప్పటిలా మ్యాచ్లు హోరాహోరీగా సాగడం లేదని అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ పోరు కంటే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మ్యాచ్లు మరింత ఉత్కంఠభరితంగా ఉంటాయన్నాడు.

'భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగకున్నా.. ఒరిగేదేమీ లేదు. చాలా కాలంగా దాయాదుల పోరు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తిగా ఏకపక్షంగా ఫలితాలొస్తున్నాయి. ఎందుకంటే పాకిస్థాన్ జట్టు 90వ దశకంలో ఉన్నట్లుగా బలంగా లేదు. ఇప్పుడు ఆ టీమ్ చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్కు పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ జట్టుతో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో మ్యాచ్ ఆడుతున్న ఫీల్ కలుగుతోంది.'అని విశ్లేషించాడు.
ఇది కేవలం ఒక క్రీడా ఘట్టం కాదని, యావత్ టోర్నమెంట్కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే అంశమని, ప్రసార హక్కుల విలువను నిర్దేశించే, చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధులు సమకూర్చే ఈ మ్యాచ్ను నిర్వహించడం ఐసీసీకి అత్యంత కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఒక టీ20 మ్యాచ్ విలువ అక్షరాలా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,500 కోట్లు) అంట.
బ్రాడ్కాస్టింగ్ రైట్స్, యాడ్స్ రెవెన్యూ, స్పాన్సర్షిప్, టికెటింగ్, బెట్టింగ్ వంటి అన్ని వాణిజ్య కార్యకలాపాలను కలిపితే ఈ స్థాయిలో ఆదాయం సమకూరుతుందని బిజినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్కూ ఇంతటి ఆర్థిక విలువ లేదంట. ప్రసారకర్తలకు ఈ మ్యాచ్ ఒక బంగారు బాతు లాంటిదని, ఈ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల యాడ్ స్లాట్కు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలు వసూలు చేస్తారని, ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే, టోర్నీ ఆర్థిక స్వరూపమే మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.