ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో మరో రసవత్తర మ్యాచ్కు రంగం సిద్దమైంది. గ్రూప్-2లో భాగంగా శ్రీలంక, పాకిస్థాన్ తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్కు సిద్దమయ్యాయి. నేటి(శనివారం) రాత్రి కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
శ్రీలంకకు ఇది నామమాత్రపు మ్యాచ్ అయినా.. పాకిస్థాన్కు మాత్రం భవితవ్యం తేల్చే మ్యాచ్. ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ అనూహ్య పరాజయం ఎదుర్కోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.
అయితే శ్రీలంకతో గెలుపే పాకిస్థాన్కు సరిపోదు. రన్రేట్ మెరుగుపర్చుకోవడం కూడా పాకిస్థాన్కు కీలకం. న్యూజిలాండ్ను ఓడించిన ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8ను అజేయంగా ముగించి గ్రూప్-2 టాపర్గా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి.

న్యూజిలాండ్ 3 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఒకటి ఓడి.. మరో మ్యాచ్ రద్దవ్వడంతో 3 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పాకిస్థాన్ 2 మ్యాచ్ల్లో ఒకటి ఓడి.. మరో మ్యాచ్ రద్దవ్వడంతో ఒక పాయింట్తో మూడో స్థానంలో ఉండగా.. శ్రీలంక రెండుకు రెండు మ్యాచ్లు ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. శ్రీలంకతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ గెలిచినా సరిపోదు. ఎందుకంటే పాకిస్థాన్(-0.461) కంటే న్యూజిలాండ్(1.390) రన్రేట్ మెరుగ్గా ఉంది.
శ్రీలంకతో మ్యాచ్లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 65 పరుగుల భారీ తేడాతో గెలవాలి. లేదంటే 13 ఓవర్లలోనే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పుడే న్యూజిలాండ్ రన్రేట్ను పాకిస్థాన్ అధిగమించవచ్చు. ఇలా జరగకుండా గెలిచినా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. న్యూజిలాండ్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.