ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించింది. టోర్నీలో ముందుడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ సమష్టిగా చెలరేగింది. గ్రూప్-ఏలో భాగంగా
బుధవారం కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. షాహిబ్జాదా ఫర్హాన్ అజేయం శతకంతో సత్తా చాటగా ఉస్మాన్ తారిక్(4/16) నాలుగు వికెట్లతో నమీబియా పతానాన్ని శాసించాడు.
ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్తో పాటు పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు నమీబియా ఓటమితో ప్రపంచకప్ టోర్నీని ముగించింది. పాకిస్థాన్ విజయంతో భారత ఎన్ఆర్ఐ ఆటగాళ్లతో కూడిన అమెరికా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. నమీబియా, నెదర్లాండ్స్పై గెలిచిన అమెరికా.. పాకిస్థాన్, భారత్ చేతిలో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38), షాదాబ్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సెల్(2/48) రెండు వికెట్లు తీయగా.. గెర్హార్డ్ ఎరాస్మస్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లారేన్ స్టీన్కాంప్(23), అలెగ్జండర్(20) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్(4/16) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షాదాబ్ ఖాన్(3/19) మూడు వికెట్లు తీసాడు. సల్మాన్ మిర్జా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
ఫిబ్రవరి 21: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ కొలంబో (శ్రీలంక) రాత్రి 7:00
ఫిబ్రవరి 24 పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ క్యాండీ (శ్రీలంక) రాత్రి 7:00
ఫిబ్రవరి 28 పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక క్యాండీ (శ్రీలంక) రాత్రి 7:00