ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఆడమ్ మిల్నే(Adam Milne) గాయంతో మెగా టోర్నీకి దూరమయ్యాడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న SA20 లీగ్ టోర్నీలో సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆడమ్ మిల్నే.. బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతని కండరాలు పట్టేయగా.. స్కానింగ్లో తీవ్ర గాయంగా తేలింది. దాంతో అతను టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు.
ఆడమ్ మిల్నే స్థానంలో 31 ఏళ్ల కైల్ జెమీసన్ జట్టులోకి వచ్చాడు. జెమీసన్ ఇప్పటికే భారత్తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టు రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆడమ్ మిల్నే గాయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్స్ మీడియాతో మాట్లాడాడు.
'ఆడమ్ మిల్నే ప్రపంచకప్ కోసం సిద్దమయ్యాడు. గాయం కారణంగా చివరి నిమిషంలో అతను వైదొలగడం జట్టుకు నిరాశ కలిగించింది. అతను త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం. కైల్ జెమీసన్ ఇప్పటికే భారత్లో జట్టుతో ఉండటం మాకు మంచి విషయం. అతను జట్టు పేస్ బౌలింగ్కు అదనపు బలాన్ని జోడిస్తాడు.'అని రాబ్ వాల్టర్స్ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఫిబ్రవరి 6న ముంబై వేదికగా అమెరికాతో తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న చెన్నైలో జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్థాన్తో తలపడనుంది. ఆ తర్వాత వారు ఫిబ్రవరి 10న అహ్మదాబాద్ స్టేడియంలో యూఏఈతో ఆడనుంది. ఫిబ్రవరి 15న సౌతాఫ్రికాతో , ఫిబ్రవరి 17న తమ చివరి లీగ్ మ్యాచ్లో కెనడాతో తలపడుతారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో న్యూజిలాండ్ నిరాశపరిచింది. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో ఆ జట్టు ఈసారి సెమీఫైనల్కు చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది.
మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్తో భారత్తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్లో నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండో టీ20 శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనుంది. మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ను ఇరు జట్లు సన్నాహకంగా ఉపయోగించుకుంటున్నాయి.