T20 World Cup 2026: 'తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం'అనే సామెత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి సరిగ్గా సరిపోతుంది. సహాయం చేసిన వారికి హాని తలపెట్టడం ఈ సామెత అర్థం. బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధికి సాయం అందించి, అండగా నిలిచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో బీసీబీ కయ్యానికి కాలు దువ్వింది.
చేసిన సాయం మరిచి శత్రు దేశం పాక్ ఆడిస్తున్నట్లుగా ఆడుతోంది. భద్రతా కారణాలను చూపుతూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగింది. అయితే బీసీబీకి ఐసీసీలో సభ్యత్వం ఇప్పించిందే బీసీసీఐ. ఈ సాయాన్ని కూడా ఆ దేశ క్రికెట్ బోర్డు మరిచిపోయింది.
ఆరంభంలో బీసీబీ నిలదొక్కుకోవడానికి బీసీసీఐ ఎంతో సాయం చేసింది. బంగ్లా క్రికెట్ బోర్డును ప్రపంచానికి పరిచయం చేయడానికి 1998లో తొలిసారి ఐసీసీ నాకౌట్ ట్రోఫీని ఢాకాలో నిర్వహించేలా బీసీసీఐ కృషి చేసింది. బంగ్లాదేశ్ జట్టుకు అంతర్జాతీయ అనుభవం కల్పించడానికి 1998లో భారత్లో జరిగిన ట్రై సిరీస్లో భాగం చేసింది. భారత్, కెన్యా, బంగ్లాదేశ్ మధ్య ఈ సిరీస్ జరిగింది.
2000లో బంగ్లాదేశ్కు టెస్ట్ హోదా వచ్చినప్పుడు వారితో తొలి చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ ఆడింది కూడా భారతే. ఇది ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది.

బంగ్లాదేశ్కు ఐసీసీ లో పూర్తి స్థాయి సభ్యత్వం, టెస్ట్ హోదా రావడంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ జగన్మోహన్ దాల్మియా కీలక పాత్ర పోషించారు. అందుకే బంగ్లాదేశీయులు ఆయనను తమ క్రికెట్ 'గాడ్ ఫాదర్'గా భావిస్తారు. అప్పట్లో ఆస్ట్రేలియా, ఇంగండ్ లాంటి దేశాలు బంగ్లాదేశ్కు టెస్ట్ హోదా ఇవ్వడానికి నిరాకరించాయి. ఆ సమయంలో ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న దాల్మియా.. ఆసియా దేశాలను ఏకం చేసి బంగ్లాదేశ్కు మద్దతు కూడగట్టారు.
2000 జూన్ 26న లండన్లో జరిగిన ఐసీసీ సమావేశంలో బంగ్లాదేశ్కు అనుకూలంగా ఓట్లు పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆ దేశాన్ని 10వ టెస్ట్ ప్లేయింగ్ నేషన్గా గుర్తించేలా కృషి చేశారు.
క్రికెట్ బోర్డు ఒక్కటే కాదు.. అసలు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిందే భారత్. అందుకోసం పాకిస్థాన్తో భారత్ యుద్దం కూడా చేసింది. బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడేలా కృషి చేసింది. 1971లో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిన సంగతి తెలిసిందే.
అప్పటి తూర్పు పాకిస్థాన్లో జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న 'ముక్తి వాహిని' గెరిల్లా దళాలకు భారత్ శిక్షణ, ఆయుధాలు అందజేసి, నైతిక మద్దతు తెలిపింది. పాక్ సైన్యం సాగిస్తున్న దాడుల వల్ల సుమారు ఒక కోటి మంది బంగ్లా శరణార్థులు భారత్కు రాగా, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వారికి ఆశ్రయం కల్పించారు. 1971 డిసెంబర్లో పాక్ భారత్పై వైమానిక దాడులకు దిగడంతో భారత్ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. కేవలం 13 రోజుల్లోనే పాక్ సైన్యాన్ని లొంగదీసుకుని బంగ్లాదేశ్కు విముక్తి కల్పించింది. భారత్ ధాటికి పాక్కు చెందిన 93,000 మంది సైనికులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
ఈ సాయాన్ని మరిచిన బంగ్లాదేశ్.. ఇప్పుడు భారత్తో కయ్యానికి కాలు దువ్వుతుంది. పాకిస్థాన్తో కలిసి భారత్కు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. బంగ్లాదేశ్ తీరును చూసి భారత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాముకు పాలు పోసి పెంచినట్లే బంగ్లాదేశ్ను భారత్ పోషించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనని మండిపడుతున్నారు.