ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-8 పోరులో భాగంగా గురువారం చెన్నై వేదికగా జరిగే మ్యాచ్లో జింబాబ్వేతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. సౌతాఫ్రికాతో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్ను భారీ తేడాతో టీమిండియా గెలవడం కీలకంగా మారింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడంతో టీమిండియా రన్ రేట్ భారీగా పడిపోయింది. ప్రస్తుతం భారత్ రన్రేట్ (-3.800) నెగటీవ్గా ఉంది.
ఈ క్రమంలోనే జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ గెలవడమే కాకుండా నెట్రన్రేట్ను మెరుగుపర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం మైనస్లో ఉన్న రన్ రేట్ను తిరిగి ప్లస్లోకి తీసుకురావడానికి భారత్కు రెండు మార్గాలున్నాయి.
జింబాబ్వేతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తే రన్రేట్ను మెరుగుపర్చుకునే అవకాశాలు టీమిండియాకు ఎక్కువగా ఉంటాయి. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో.. ఆ లోటు పూడ్చాలంటే జింబాబ్వేతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు నెగటీవ్గా ఉన్న రన్రేట్ పాజిటీవ్గా మారుతుంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 170 పరుగులు చేస్తే.. జింబాబ్వేను 92, 180 రన్స్ చేస్తే 103, 200 చేస్తే 123లోపు ఆలౌట్ చేయాలి.

జింబాబ్వేతో మ్యాచ్లో ఛేజింగ్ చేయాల్సి వస్తే మాత్రం పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంటుంది. సాధారణంగా 16, 17 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేస్తే నెట్రన్రేట్ కొద్దిగా మెరుగుపడుతుందే తప్ప.. మైనస్ నుంచి ప్లస్లోకి రాదు. 10, 12 ఓవర్లలోనే జింబాబ్వే లక్ష్యాన్ని అధిగమిస్తేనే రన్రేట్ మెరుగువుతుంది. అయితే ఇది అంత సులువు కాదు.
ఛేజింగ్లో.. జింబాబ్వే 140 పరుగులు చేస్తే భారత్ 10.4 ఓవర్లలో, 160 చేస్తే 11.2 ఓవర్లలో, 180 చేస్తే 11.4 ఓవర్లలో, 200 చేస్తే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడితేనే ఇది సాధ్యం. మధ్య ఓవర్లలో రన్ రేట్ కొద్దిగా తగ్గినా అది నెట్రన్రేట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
దూకుడుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. ఇలా జరగాలంటే సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవడం కీలకం. అయితే చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ డ్యూ ప్రభావం ఉండకుండా కెమికల్ స్ప్రే చేశారు.
ఈ మ్యాచ్కు టీమిండియా తమ కాంబినేషన్లో మార్పులు చేయనుంది. ఓపెనర్గా సంజూ శాంసన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అతను అభిషేక్కు జోడీగా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇషాన్ మూడో స్థానంలో ఆడొచ్చు. ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు తెలివిగా.. పవర్ ప్లేలో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్, అభిషేక్, తిలక్లకు ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. కుడిచేతి వాటం బ్యాటరైన శాంసన్ను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.