ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు కనబర్చిన పాకిస్థాన్కు టీమిండియా దిమ్మతిరిగే షాకిచ్చింది. గత చరిత్రను పునరావృతం చేస్తూ.. 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించడంతో ఏకపక్షంగా ముగిసింది.
బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై భారత్ 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ విజయంతో గ్రూప్-ఏ నుంచి టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకోగా.. పాకిస్థాన్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో పాకిస్థాన్ నెట్రన్రేట్ కూడా దెబ్బతిన్నది.

వరుసగా మూడు విజయాలతో టీమిండియా గ్రూప్-ఏ టాపర్గా కొనసాగుతుండగా.. నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించిన అమెరికా రెండో స్థానంలో ఉంది. మూడింటిలో రెండు గెలిచిన పాకిస్థాన్ పేలవ రన్రేట్తో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. నెదర్లాండ్స్, నమీబియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే భారత్ సూపర్-8 బెర్త్ దక్కించుకోగా.. రెండో బెర్త్ కోసం అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ను నమీబియాతో ఆడనుంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణంతో సంబంధంతో లేకుండా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం రన్రేట్ కీలకం అవుతుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ఆడిన అమెరికా రెండు విజయాలతో పాటు మెరుగైన రన్రేట్తో రెండో స్థానంలో ఉంది.
నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్ను బుధవారమే టీమిండియాతో ఆడనుంది. భారత్ను ఓడించి మెరుగైన రన్రేట్ సాధిస్తే నెదర్లాండ్స్ కూడా సూపర్-8 రేసులోకి వస్తుంది. కానీ గ్రూప్ టాపర్ అయిన భారత్ను ఓడించడం ఆ జట్టుకు అంత ఈజీ కాదు.
ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లకు మూడు ఓడిన నమీబియా ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి తప్పుకుంది. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించి బోణీ కొట్టాలని ఆ జట్టు భావిస్తోంది. తద్వారా పాకిస్థాన్ను తమ వెంట ఇంటికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది. భారత్ చేతిలో ఓడటం పాకిస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. నమీబియా గట్టిగా పోరాడితే ఆ జట్టు సంచలన విజయం సాధించివచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నమీబియాతో మ్యాచ్ రద్దయినా పాకిస్థాన్ సూపర్-8 బెర్త్ ఖరారు అవుతుంది. ఓడితే మాత్రం ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది.