Gautam Gambhir: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో బరిలోకి దిగే జట్లు భారత్, శ్రీలంకకు చేరుకున్నాయి. అయితే గ్రూప్ స్టేజ్లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్పై అనిశ్చితి నెలకొంది. ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఐసీసీ తప్పుబట్టింది.
పునరాలోచన చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు మ్యాచ్ బహిష్కరణ విషయాన్ని ఐసీసీకి పీసీబీ అధికారికంగా తెలుపలేదు. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థాన్ జరుగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

ఈ అంశాన్ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముందు మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. స్పందించేందుకు గంభీర్ నిరాకరించాడు. మెగా టోర్నీ నేపథ్యంలో నేడు(బుధవారం) భారత్, సౌతాఫ్రికా మధ్య జరగనున్న వామప్ మ్యాచ్ కోసం గంభీర్ ముంబైకి వచ్చాడు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో గంభీర్ను పాక్ వివాదంపై మీడియా ప్రశ్నించింది. అతను మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు.
తమ జట్టు ప్రపంచకప్ ఆడుతుందని ప్రకటించిన పాక్ ప్రభుత్వం.. భారత్తో మ్యాచ్ బాయ్ కట్ చేస్తున్నామని అధికారికంగా తెలిపింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. కోట్ల వ్యాపారంతో కూడుకున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందని, అవసరమైతే ప్రభుత్వాలనే వ్యాపార సంస్థలు ఒప్పిస్తాయని మెజార్టీ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారత్, నమీబియా, నెదర్లాండ్, యూఏస్తో పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉంది. ఇప్పటికే శ్రీలంక చేసిర పాకిస్థాన్ జట్టు ఐర్లాండ్తో వామప్ మ్యాచ్కు సిద్దమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫొటో షూట్లో కూడా పాల్గొన్నది.
ఫిబ్రవరి 7న అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. ఫిబ్రవరి 12న నమీబియాతో, ఫిబ్రవరి 15న పాకిస్థాన్తో, ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో తలపడుతుంది. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు చేరుతాయి. పాకిస్థాన్ బాయ్కట్ చేస్తే ఆ మ్యాచ్లో భారత్ను విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు పాకిస్థాన్ సూపర్ 8 చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్లకు మూడు గెలవాల్సి ఉంటుంది. ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. సూపర్-8కు భారత్ అర్హత సాధిస్తే వేర్వేరు గ్రూప్లో ఆడుతాయి. సెమీఫైనల్ లేదా ఫైనల్లోనే మళ్లీ తలపడాల్సి ఉంటుంది. అప్పుడు పాకిస్థాన్ బాయ్ కట్ చేస్తుందా? మ్యాచ్ ఆడుతుందా? అనేదానిపై కూడా క్లారిటీ లేదు.