T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మోగా టోర్నీకి మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు భారత్, శ్రీలంక చేరుకున్నాయి. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ బాంబు పేల్చింది. భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది.
ఈ విషయమై ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక సమాచారం ఇవ్వకపోయినప్పటికీ.. ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై ఐసీసీ ఘాటుగా స్పందించింది. టీ20 ప్రపంచకప్ 2026లో ఒక జట్టుతో మాత్రమే ఆడమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచన చేయాలని సూచించింది. కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే.. పాకిస్థాన్ మ్యాచ్ ఆడకుండానే 2 పాయింట్స్ కోల్పోనుంది. వాకోవర్గా భావించి భారత్ను విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈ మ్యాచ్ జరగకపోతే రూ.4500 కోట్ల వ్యాపారం దెబ్బతిననుంది. ఇప్పటికే పీసీబీతో ఐసీసీ చర్చలు ప్రారంభించింది. భారత్, పాక్ మ్యాచ్ జరిగే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలను శాసించే వ్యాపార సంస్థలు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించినా.. ఆ జట్టు సునాయసంగా సెమీఫైనల్ చేరుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ మ్యాచ్లన్నింటీని ఒకే వేదికగా ఆడుతుండటం పాకిస్థాన్కు కలిసొచ్చే అతిపెద్ద అంశమని చెబుతున్నారు. ఆ జట్టు శ్రీలంకలోని రెండు వేదికల్లోను తమ మ్యాచ్లను ఆడనుంది. ప్రయాణం చేసి అలసిపోవాల్సిన అవసరం లేకపోగా.. పిచ్ కండిషన్స్ పూర్తిగా అర్థం కానున్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ కూడా ఇలానే దుబాయ్ వేదికగా తమ అన్నీ మ్యాచ్లను ఆడి విజేతగా నిలిచింది. ఇప్పుడు పాకిస్థాన్కు ఆ అడ్వాంటేజ్ లభించనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక కండిషన్స్ పాకిస్థాన్కు కొత్త కాదు. ఇప్పటికే ఇక్కడ ఎన్నో సార్లు ఆ జట్టు ఆడి ద్వైపాక్షిక సిరీస్లు గెలిచింది. స్పిన్కు అనుకూలంగా ఉండే ఈ వికెట్లు పాకిస్థాన్కు కలిసిరానున్నాయి.
భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది. భారత్తో మ్యాచ్ ఆడకున్నా.. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్తో విజయం సాధిస్తే పాకిస్థాన్ సూపర్-8 చేరనుంది. సూపర్-8లో భారత్తో పాకిస్థాన్ తలపడే అవకాశం లేదు. లీగ్ దశలో ఈ రెండు జట్లు ఒకే గ్రూప్లో ఉండటంతో సూపర్-8లో వేర్వేరు గ్రూప్లో ఆడనున్నాయి. అక్కడ కూడా పాకిస్థాన్, భారత్ విజయాలు సాధిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్లోనే తలపడనున్నాయి. ఏదీ ఏమైనా భారత్తో మ్యాచ్ ఆడకపోయినా.. పాకిస్థాన్ సునాయసంగా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.