'ఆడలేక మద్దెల ఓడు' అనే సామెత పాకిస్థాన్ జట్టుకు సరిగ్గా సరిపోతుందని ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. భారత్ను ఓడించే సత్తా లేక బాయ్కట్ అనే డ్రామా ఎత్తుకుందని మండిపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై సరికాదన్నాడు.
ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా పాకిస్థాన్ క్రికెట్కే ఎక్కువ నష్టం జరుగుతుందని, టీమిండియాను ఎదుర్కోవడానికి పాక్ భయపడుతోందనే తప్పుడు సంకేతాలు ప్రపంచానికి వెళతాయని తెలిపాడు.
ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడిన కనేరియా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. ఈ నిర్ణయంలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నాడు.

'భారత్లో పర్యటించబోమని గతంలోనే పాకిస్థాన్ చెప్పింది. వచ్చే మూడేళ్ల పాటు తటస్థ వేదికగా ఆడేలా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాంతోనే పాకిస్థాన్ మ్యాచ్లను శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మ్యాచ్ను బహిష్కరించడంలో అర్థం లేదు. ఈ అనాలోచిత నిర్ణయంతో పాకిస్థాన్ తమ సెమీఫైనల్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.
ప్రస్తుతం భారత్ ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను చూసి పాకిస్థాన్ భయపడుతోంది. ప్రపంచకప్లో ప్రతీసారి భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచకప్ టోర్నీ సెమీస్, ఫైనల్లో భారత్తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? అప్పుడు కూడా ఆడకుండా ట్రోఫీని అప్పగిస్తారా? మైదానంలో పోరాడి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలి కానీ, ఇలా బహిష్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు' అని కనేరియా పీసీబీకి చురకలు అంటించాడు. ఈ నిర్ణయం పట్ల పాకిస్థాన్ క్రికెటర్లలో చాలా మంది అసంతృప్తితో ఉన్నప్పటికీ, వారు బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో ఒక జట్టుతో మాత్రమే ఆడమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమని ఐసీసీ పేర్కొంది. పాకిస్థాన్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్థాన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టకపోతే వాకోవర్గా పరిగణిస్తారు. భారత్కు ఉచితంగా 2 పాయింట్ల లభిస్తాయి. టోర్నీ ప్రారంభం కాకముందే భారత్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరినట్లే. ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్ నెట్ రన్రేట్ గణనీయంగా తగ్గుతుంది. ఇది వారి సెమీఫైనల్ అవకాశాలను దెబ్బతీయవచ్చు.
ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న పాకిస్థాన్ జట్టుకు, ఈ రాజకీయ నిర్ణయం టోర్నీలో పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.