Basit Ali: దమ్ముంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సవాల్ విసిరాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన వార్తలపై బాసిత్ అలీ మండిపడ్డాడు.
పీసీబీ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ మాట వినకపోతే పాకిస్థాన్పై నిషేధం కూడా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తప్పుబడుతూ బాసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీకి అంత సీన్ లేదన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అతను.. ఐసీసీ వైఖరిని తప్పుబట్టాడు.
'భారత జట్టే ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టింది. పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అప్పట్లో బీసీసీఐ చెప్పింది. ఇప్పుడు మా ప్రభుత్వం భారత్తో ఆడవద్దని చెబుతోంది. భారత ప్రభుత్వం మాట బీసీసీఐ విన్నప్పుడు.. పాక్ ప్రభుత్వం మాటను పీసీబీ వినకూడదా? వాళ్లు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?

1996 ప్రపంచకప్లో భద్రతా కారణాలతో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ శ్రీలంకలో ఆడటానికి నిరాకరించాయి. 2003 ప్రపంచకప్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కొన్ని మ్యాచ్లు బహిష్కరించాయి. ఆ సమయంలో ఆ జట్ల పాయింట్స్లో మాత్రమే కోత విధించారు. ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ జట్టుపై నిషేధం విధిస్తామని హెచ్చరిస్తున్నారు. మీకు దమ్ము ఉంటే ఆ పని చేయండి.
ఐసీసీ ఇప్పుడు పీసీబీ నుంచి లిఖిత పూర్వక వివరణ అడుగుతోంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్థాన్కు రాబోమని ఐసీసీకి బీసీసీఐ లిఖిత పూర్వక హామీ ఇచ్చిందా? భారత క్రికెట్ బోర్డును అడగని ప్రశ్నను పీసీబీని ఎందుకు అడుగుతున్నారు?'అని బాసిత్ అలీ నిలదీసాడు.
ఐసీసీ మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి కూడా పాకిస్థాన్కు మద్దతు తెలిపాడు. ప్రభుత్వ ఆదేశాలను పాటించే దేశంపై ఐసీసీ చర్య తీసుకోదని, భారత్ కూడా ప్రభుత్వ అనుమతి లేదనే పాకిస్థాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రభుత్వ ఆదేశాలతోనే భారత్తో మ్యాచ్ ఆడనంటుంది. భారత్, పాక్ విషయాల్లో సమన్యాయం పాటించాలని చెప్పాడు. భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే.. ఐసీసీ రూల్స్ ప్రకారం టీమిండియాకు రెండు పాయింట్స్ లభిస్తాయి. పాకిస్థాన్కు ఐసీసీ నుంచి రావాల్సిన రూ.300 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.