Anil Kumble: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన భారత జట్టుతో పొల్చితే ప్రస్తుత టీమ్ బలంగా ఉన్నప్పటికీ, చాలా విషయాల్లో వెనుకంజలో ఉందన్నాడు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని రోహిత్ సేన.. ప్రస్తుత గంభీర్ పర్యవేక్షణలో సూర్య టీమ్ కంటే గొప్పదని అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు రోహిత్ సేన తెరదించింది. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో విజయం సాధించిన భారత్ రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడింది. కీలకమైన సమయాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అనుభవం భారత విజయానికి కలిసొచ్చింది.
ఈ విజయానంతరం ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. దాంతో భారత టీ20 క్రికెట్లో ఒక శకం ముగిసింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరో జట్టు రెడీ అయ్యింది. గత రెండేళ్లలో 9 ద్వైపాక్షిక సిరీస్లను సూర్యసేన గెలిచి హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్ షోలో మాట్లాడిన అనిల్ కుంబ్లే.. రోహిత్ సేన గొప్పదని అభిప్రాయపడ్డాడు. 'అనుభవం గురించి మాట్లాడితే టీమిండియా ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను కోల్పోయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టు సమతూకం గురించి మాట్లాడితే సూర్యసేన బలంగా ఉంది. ఎందుకంటే ఈ జట్టులో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటింగ్లో దూకుడైన అప్రోచ్తో భీకరంగా కనిపిస్తోంది.

అయితే ఈ టోర్నీ సవాల్గా ఉంటుంది. 2024లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ జట్టు కంటే రోహిత్ సేన 10 శాతం ముందుందని చెబుతాను. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ తీవ్ర ఒత్తిడిలో మెరుగైన ప్రదర్శన కనబర్చారు. తాజా టోర్నీలో అలాంటి ప్రదర్శనలు రిపీట్ కావాలి. సూర్య ఫామ్లో ఉండటం ముఖ్యం. క్లిష్టపరిస్థితుల్లో అతను రాణిస్తేనే భారత్ గెలుస్తుందని గ్రహించాలి.'అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి రంగం సిద్దమైంది. ఆదివారం( ఫిబ్రవరి 7) ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అమెరికాతో జరిగే తొలి మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ను మెదలు పెట్టనుంది. ఫిబ్రవరి 7న అమెరికాతో, ఫిబ్రవరి 12న నమీబియాతో, ఫిబ్రవరి 15న పాకిస్థాన్తో, ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో భారత్ తమ లీగ్ మ్యాచ్లు ఆడనుంది. అయితే భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో భారత్, పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఐసీసీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాక్ ఆడకపోతే భారత్కు 2 పాయింట్స్ ఉచితంగా లభించనున్నాయి. కానీ రూ.4500 కోట్ల వ్యాపారం దెబ్బతిననుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా రూ.348 కోట్లు నష్టపోనుంది.