వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024లో సౌతాఫ్రికా విజేతగా నిలుస్తుందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అంచనా వేసాడు. ప్రస్తుతం ఆ జట్టు అద్భుతంగా ఆడుతుందని కొనియాడాడు. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఈ టోర్నీలో సత్తా చాటుతాయని అభిప్రాయపడ్డాడు.
వచ్చే ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో విజేతగా నిలవాలంటే టీమిండియా తీవ్రంగా శ్రమించాలని గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. గత 10 ఏళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ను కూడా సాధించలేకపోయింది.

సెమీస్, ఫైనల్స్ చేరుతున్నా.. తృటిలో ఛాంపియన్గా నిలిచే అవకాశాలను చేజార్చుకుంటుంది. తాజాగా ఓ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్, యువరాజ్ సింగ్ టీ20 ప్రపంచకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్లో భారత్కు మూడు జట్లతో గట్టి పోటీ ఉంటుందని గంభీర్ చెప్పాడు .
'మూడు జట్ల నుంచి టీమిండియాకు తీవ్ర పోటీ ఉంటుంది. అందులో అఫ్గానిస్థాన్ ఒకటి. యూఎస్ఏ పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు అనుకూలంగా ఉంటాయి. అందుకే అఫ్గాన్ అత్యంత ప్రమాదకరమైన జట్టని చెబుతున్నా. ఆస్ట్రేలియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. కీలమైన మ్యాచ్ల్లో సత్తా చాటే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఇంగ్లండ్ కూడా తీవ్రమైన పోటీనిస్తోంది. టీ20 క్రికెట్ను ఆడే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. గంభీర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పాడు. 'గంభీర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. కానీ నా దృష్టిలో సౌతాఫ్రికా విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆ జట్టు చాంపియన్గా నిలవలేదు. ఇటీవల ఆ జట్టు అద్భుతంగా ఆడుతోంది. వన్డే ప్రపంచకప్లోనూ సౌతాఫ్రికా అద్భుతంగా రాణించింది. పాకిస్థాన్ను కూడా ఏ మాత్రం అంచనా వేయలేం'అని యువరాజ్ సింగ్ అన్నాడు.
అయితే పాకిస్థాన్ ప్రమాదకరమైన జట్టే అయినా.. ఫీల్డింగ్ నాసిరకమన్నాడు. 'పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. వన్డే ప్రపంచకప్లో వారు ఓడిపోవడానికి ఇదీ ఓ కారణం. ఇటీవల అంతర్జాతీయ మ్యాచుల్లో ఆ జట్టు ఫీల్డింగ్ ప్రదర్శన నాసిరకమే. ఒకవేళ వారు టీ20 ప్రపంచకప్లో పోటీ ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆ విభాగంపై ఫోకస్ పెట్టాల్సిందే. గత ఐదారేళ్ల వ్యవధిలో టీమిండియాలా పాకిస్థాన్ తుది పోరుకు అర్హత సాధించలేదు. భారత్ తృటిలో కప్లను చేజార్చుకుంది. ఈసారి మాత్రం టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంటుందనే ఆశాభావంతో ఉన్నా'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.