టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరింది. శనివారం భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరపడనుంది. ఇరు జట్లు వరుస విజయాలతో ఓటమెరుగని టీమ్స్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. ఓవైపు తొలి ఐసీసీ టైటిల్ అందుకోవాలని సౌతాఫ్రికా.. మరోవైపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని టీమిండియా పట్టుదలతో ఉన్నాయి. బలాలు, ఫామ్ పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికీ స్పిన్ అటాక్ విషయంలో భారత్ కాస్త ఫేవరేట్గా కనిపిస్తోంది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే సెమీఫైనల్ తరహాలోనే ఈ బిగ్ ఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉంది. కరీబియన్లో ప్రస్తుతం వర్షం కాలం కావడంతో రోజు వర్షాలు పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ జరిగే బ్రిడ్జ్ టౌన్లోనూ వర్షాలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ జరిగే సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

మ్యాచ్ రద్దయితే..?
అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం అంతరాయంతో శనివారం మ్యాచ్ జరగకపోతే ఆదివారం నిర్వహిస్తారు. ఆదివారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయి. దాంతో ఆట నిర్వహణ కోసం 190 నిమిషాలు అదనపు సమయాన్నీ రెండు రోజులకు కేటాయించారు. ఐసీసీ నాకౌట్ రూల్స్ ప్రకారం ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడితేనే ఫలితాన్ని తేల్చుతారు.
రిజర్వ్ డేతో కలుపుకొని కటాఫ్ సమయంలో ఇరు జట్లు 10 ఓవర్లు ఆడకపోతే మ్యాచ్ను రద్దు చేస్తారు. అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. వర్షం కారణంగా శనివారం మధ్యలోనే మ్యాచ్ ఆగిపోతే.. రిజర్వ్డే అయిన ఆదివారం అక్కడి నుంచే ప్రారంభిస్తారు.
పిచ్ రిపోర్ట్..
బ్రిడ్జ్ టౌన్ వికెట్లో గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బలమైన గాలులు వీస్తుంటాయి. అందుకు తగ్గట్లు బౌలింగ్, బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఈ వేదికగా మొత్తం 9 మ్యాచ్లు జరగ్గా.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఓమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది. మిగతా ఏడు మ్యాచ్ల్లో నాలుగు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందింది. ఈ వికెట్పై స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు.
ఈ వికెట్పై అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలుపొందింది. సౌతాఫ్రికా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.