అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)పై ఆసీస్, బ్రిటీష్ మీడియా గగ్గోలు పెడుతోంది. క్రికెట్ను పూర్తిగా కమర్షియల్ చేశారని, డబ్బుల కోసం ఆటను పూర్తిగా దిగజార్చుతున్నారని విమర్శిస్తోంది. ఎక్కువ ఆదాయం కలిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఐసీసీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తోంది.
తాజా టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ను భారత అభిమానులను ఉద్దేశించి రూపొందించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. క్రికెట్ మతంగా భావించే భారత్లో అనుకూల సమయంలో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారమయ్యేలా షెడ్యూల్ను రూపొందించిందని, ఇతర అభిమానులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

గ్రూప్ దశ మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా సీడింగ్ ద్వారా సూపర్-8 గ్రూప్స్ను డిసైడ్ చేయడం.. భారత అభిమానుల కోసం సెమీఫైనల్ మ్యాచ్ను ముందుగానే షెడ్యూల్ను చేయడం, రాత్రి 8 గంటలకు గయానాలో మ్యాచ్ పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ ఎడిషన్ పూర్తిగా రైన్, షైన్.. ఇండియా విన్ అన్నట్లు సాగిందని బ్రిటీష్ మీడియా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
గ్రూప్ దశలో భారత్ మ్యాచ్లను అమెరికాలో ఒకే వేదికలో పెట్టడం చూస్తేనే ఇతర జట్ల విషయంలో ఐసీసీ వివక్ష అర్థమవుతుందని దుయ్యబట్టింది.
బ్రిటీష్ మీడియాలోని ప్రముఖ సంస్థ అయిన 'ది మెయిల్', ఆసీస్లోని 'ది రోర్' ఐసీసీ ద్వంద వైఖరిని తప్పుబడుతూ విమర్శనాత్మక కథనాలను ప్రచురించాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఆదరణ పెంచాలని భావించిన ఐసీసీ.. పూర్తిగా బీసీసీఐ కనుసన్నల్లో పనిచేయడం బాలేదని, డబ్బులకు విలువ ఇవ్వడం కూడా సరికాదని పేర్కొన్నాయి. క్రికెట్ను కమర్షియలైజ్ చేయడం ద్వారా ఆటకు తీరని నష్టం జరుగుతుందని కొందరు మాజీ క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే టీమిండియా విజయాలను సహించలేకనే ఆస్ట్రేలియా, బ్రిటీష్ మీడియా ఐసీసీపై విమర్శలు చేస్తున్నాయని ఈ కథనాలను మరికొందరు తిప్పికొడుతున్నారు. ఏది ఏమైనా.. భారత్ అభిమానుల కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ను రూపొందించడాన్ని క్రికెట్ ప్రేమికులు కూడా స్వాగతించలేకపోతున్నారు.