టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గర పడుతోంది. మరో 19 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. జూన్ 1 నుంచి 29 వరకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. మెగా టైటిల్ కోసం గత 11 ఏళ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా.. ఈ సారైనా ఆ కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఇప్పటికే ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఐపీఎల్ 2024 లీగ్ దశ మ్యాచ్లు ముగియగానే.. టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించనుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఈ శిక్షణ శిభిరం నిర్వహించనుంది.

ఐపీఎల్ 2024 సీజన్తో సూపర్ ప్రాక్టీస్లో ఉన్న భారత ఆటగాళ్లు.. మెగా టోర్నీలో ఎలా రాణిస్తారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు టీమిండియాకు ఎక్స్ఫ్యాక్టర్గా మారనున్నారు. వారు రాణించడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా..
టీమిండియాకు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకం కానున్నాడు. పేస్ ఆల్రౌండర్గా అతను రాణించడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో అతను పర్వాలేదనపించాడు. అతని ప్రదర్శనలో నిలకడ లోపించినా.. బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా ఫామ్లోకి వస్తే టీమిండియా కాంబినేషన్ సమతూకంగా ఉండనుంది.
భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 92 మ్యాచ్లు ఆడి 1348 పరుగులతో పాటు 73 వికెట్లు తీసాడు. హార్దిక్ రిథమ్ అందుకుంటే భారత్ను ఓడించడం ప్రత్యర్థులకు సవాలే.
యశస్వి జైస్వాల్..
ఎదుర్కొన్న తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడటం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రత్యేకత. అతను విధ్వంసకర బ్యాటింగ్తో శుభారంభాలు అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. భారత్ భారీ లక్ష్యాలు నమోదు చేయాలంటే యశస్వి జైస్వాల్ రాణించడం కీలకం.
రిషభ్ పంత్..
ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమైన రిషభ్ పంత్.. రీఎంట్రీలో దుమ్మురేపాడు. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే సామర్థ్యం రిషభ్ పంత్కు ఉంది. అతని రాకతో బ్యాటింగ్ లైనప్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా లభిస్తోంది. గతంలో మాదిరి అతను చెలరేగితే.. టీమిండియాకు బిగ్ అసెట్గా మారుతాడు.