అంతర్జాతీయ టీ20 క్రికెట్లో శ్రీలంక టీమ్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. తొలి 10 ఓవర్లలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న గ్రూప్ డీ లీగ్ మ్యాచ్లో శ్రీలంక 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 40 పరుగులే చేసింది.
రెండు దశాబ్దాల టీ20 క్రికెట్ చరిత్రలో తొలి 10 ఓవర్లలో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 2007 టీ20 ప్రపంచకప్లో కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 10 ఓవర్లలో 43/7 పరుగులు చేసింది. ఆ తర్వాత 2021లో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక 42/2 పరుగులు చేసింది.

2022లో ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 43/4 రన్స్ నమోదు చేసింది. తాజాగా 40/5 రన్స్తో చెత్త రికార్డును నమోదు చేసింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా(4/7) నిప్పులు చెరగడంతో ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది.
నోకియాకు అండగా కగిసో రబడా(2/21), కేశవ్ మహరాజ్(2/22) రెండేసి వికెట్లు తీయగా.. ఓట్నీల్ బార్ట్మన్ ఓ వికెట్ పడగొట్టాడు. సఫారీ బౌలర్ల ధాటికి నలుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌటయ్యారు.

కుశాల్ మెండీస్(30 బంతుల్లో ఫోర్తో 19), ఏంజెలో మాథ్యూస్(16 బంతుల్లో 2 సిక్స్లతో 16), కామిందు మెండిస్(15 బంతుల్లో ఫోర్తో 11) రెండెంకల స్కోర్లు చేశారు.
కెప్టెన్ వానిందు హసరంగా(0), సదీర విక్రమార్క(0), మతీష పతీరణ(0), నువాన్ తుషారా(0) డకౌటవ్వగా.. పాతుమ్ నిస్సంక(3), చరిత్ అసలంక(6), డసన్ షనక(9), మహీష్ తీక్షణ(7 నాటౌట్) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
కెప్టెన్ వానిందు హసరంగా తప్పిదంతో శ్రీలంక మూల్యం చెల్లించుకుంది. పిచ్ కండిషన్స్ను సరిగ్గా రీడ్ చేయకుండా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం శ్రీలంక కొంపముంచింది.