తన కెరీర్ మళ్లీ ట్రాక్లోకి రావడానికి దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీనే ప్రధాన కారణమని టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబే అన్నాడు. ధోనీ గైడెన్స్లో ఐపీఎల్ ఆడటం తన కెరీర్కు ఎంతో ఉపయోగపడిందని, టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేలా చేసిందన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్ను బుధవారం ఐర్లాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టులో శివమ్ దూబేకు చోటు దక్కనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన శివమ్ దూబే.. తన కెరీర్ ఎదుగుదలకు ధోనీనే కారణమని చెప్పాడు.

ధోనీ కారణంగానే తన ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు.'నా రీఎంట్రీలో మహేంద్ర సింగ్ ధోనీ భాయ్ పాత్ర కీలకమైనది. ఎందుకంటే ధోనీలాంటి దిగ్గజ క్రికెటర్ల సలహాలు ఏ ఆటగాడికైనా ఉపయోగపడుతాయి. ఏదైనా సానుకూలంగా చెబితే మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అతని సలహాలు నా కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఐపీఎల్లో నాకు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశాలు రాలేదు. నేను ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసాను. అయినా ఓ వికెట్ తీసాను. అది నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా.. నేను ప్రాక్టీస్ చేయడం ఆపలేదు. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా శ్రమించాను. అవకాశం వచ్చినప్పుడు బంతితో సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నాను.
రోహిత్, రాహుల్ భాయ్.. నన్ను ఆల్రౌండర్గా తీసుకుంటున్నామని చెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా 2-3 ఓవర్లు వేసేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు.'అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సీఎస్కే తరఫున శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాట్తో దుమ్మురేపాడు.

మిడిలార్డర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన శివమ్ దూబే 14 మ్యాచ్ల్లో 162.30 స్ట్రైక్రేట్తో 396 పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తుండటంతో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శివమ్ దూబేకు పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో రింకూ సింగ్ను పక్కనపెట్టి మరీ అతన్ని ఎంపిక చేశారు.
గతంలో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా శివమ్ దూబేకు టీమిండియాలో అవకాశాలు ఇచ్చినా అందిపుచ్చుకోలేకపోయాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్కు మారిన అతను అప్పటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2022లో 11 మ్యాచ్ల్లో 289 పరుగులు చేసిన శివమ్ దూబే.. గతేడాది 418 పరుగులతో జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదంతా ధోనీ గైడన్సీతో సాధ్యమైందని శివమ్ దూబే పేర్కొన్నాడు.