పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్పై ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని స్వార్థమే పాకిస్థాన్ జట్టును నాశనం చేసిందని మండిపడ్డాడు. బాబర్ ఆజామ్ చెత్త కెప్టెన్సీ కారణంగానే పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైందని, గ్రూప్ దశలోనే ఇంటి దారిపట్టిందని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్తో జరిగిన మ్యాచ్ల్లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. కెనడాపై విజయం సాధించినా.. అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఐదు పాయింట్స్ సాధించిన అమెరికా, పాకిస్థాన్ను వెనక్కి నెట్టి సూపర్-8కు అర్హత సాధించింది.

లీగ్ దశలోనే పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే షాహిద్ అఫ్రిది.. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా బాబర్ ఆజామ్పై మండిపడ్డాడు. షాహిన్ షా అఫ్రిది నుంచి బాబర్ ఆజామ్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.
అతన్నే కెప్టెన్ కొనసాగించాలని చెప్పి మద్దతుగా నిలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాడు. 'పాకిస్థాన్ కెప్టెన్సీ మార్పు విషయంలో బాబర్ ఆజామ్ తప్పు చేశాడు. వన్డే ప్రపంచకప్ వైఫల్యం అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న అతను మళ్లీ సారథ్య బాధ్యతలు స్వీకరించాల్సింది కాదు.
షాహిన్ అఫ్రిదినే కెప్టెన్గా కొనసాగించాల్సిందని సెలెక్టర్లకు చెప్పాల్సింది. కనీసం టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అయినా షాహిన్ అఫ్రిదిని కెప్టెన్గా ఉంచాలని, అతని సారథ్యంలో ఆడుతానని చెప్పి ఉంటే అతనిపై గౌరవం పెరిగేది. ఈ విషయంలో బాబర్ ఆజామ్ ఒక్కడినే తప్పుబట్టాల్సిన పనిలేదు. సెలెక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉంది.
సెలెక్షన్ కమిటీలోని కొందరు బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ చేయడమే రాదని డైరెక్ట్గా చెప్పారు. అయినా మళ్లీ అతనికే సారథ్య బాధ్యతలు ఇచ్చారు.'అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో బాబర్ ఆజామ్ సారథ్యంలో పాకిస్థాన్ విఫలమవడం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ 2021లో సెమీస్ చేరిన పాకిస్థాన్.. 2022 టీ20 ప్రపంచకప్లో ఫైనల్ చేరింది. కానీ తాజా ఎడిషన్లో మాత్రం లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.