టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన స్కాట్లాండ్ తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో ఓమన్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఓమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ప్రతీక్ అథవాలే(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. అయాన్ ఖాన్(39 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

సఫ్యాన్ షరీఫ్(2/40) రెండు వికెట్లు తీయగా.. మార్క్ వాట్, బ్రాడ్ వీల్, క్రిస్ సోలే, క్రిస్ గ్రేవ్స్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లెన్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 ఫోర్లతో 61 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అతనికి తోడుగా జార్జ్ మూన్సే(20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 41) రాణించాడు.
ఓమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్, అఖిబ్ , బిలాల్ ఖాన్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో స్కాట్లాండ్ గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. ఆ తర్వాత నమీబియాపై గెలిచిన స్కాంట్లాండ్ తాజా మ్యాచ్లో ఓమన్ను ఓడించి సూపర్-8 అవకాశాలను మెరుగుపరుచుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలుపొందినా.. రన్ రేట్ తగ్గకుండా గట్టి పోటీనిచ్చినా స్కాట్లాండ్ టోర్నీలో ముందడుగు వేస్తోంది. స్కాంట్లాండ్ తాజా విజయంతో ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.
స్కాట్లాండ్తో తొలి మ్యాచ్ రద్దవ్వగా.. ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. ప్రస్తుతం ఆ జట్టు రన్రేట్ -1.800 నెగటీవ్లో ఉంది. ఓమన్, నమీబియా దేశాలపై ఇంగ్లండ్ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 5 పాయింట్సే ఉంటాయి. అప్పుడు స్కాంట్లాండ్తో సమంగా నిలుస్తోంది. రన్రేట్ మెరుగ్గా ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది.
ఆసీస్ చేతిలో స్కాంట్లాండ్ చిత్తుగా ఓడి.. ఇంగ్లండ్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో భారీ విజయం సాధిస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేదు. ఈ క్రమంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు నిష్క్రమణ తప్పదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.