ఇండియా పోస్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఎగ్జామ్లో టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించి వచ్చిన ప్రశ్న అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒడిశా సర్కిల్లో నిర్వహించిన ఈ పరీక్షలో మెగా టోర్నీకి సంబంధించి సులువైన ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నను చూసి క్రికెట్ అభిమానులు అవాక్కవుతున్నారు.
ఇంత సులువైన ప్రశ్ననా..? క్రికెట్ను ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..? టీ20 ప్రపంచకప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు..? ఆప్షన్స్గా.. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ల పేర్లు ఇచ్చారు.

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ చూసిన ప్రతీ ఒక్కరు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు. ఎందుకంటే సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. జూన్ 19న బ్రిడ్జ్ టౌన్(వెస్టిండీస్) వేదికగా జరిగిన ఈ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. పిచ్కు తగ్గట్లు విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76), అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 47) ఆచితూచి ఆడి పోరాడే లక్ష్యాన్ని అందించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసి ఓటమిపాలైంది. 151/5తో సునాయస విజయం అందుకునేలా కనిపించిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శనకు తోడు.. ఆఖరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్తో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్పై సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. మొత్తం 15 వికెట్లతో భారత విజయంతో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.