టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో టీమిండియా అభిమానులను రోహిత్ శర్మ హెచ్చరించాడు. ప్రపంచకప్లో టీమిండియా మ్యాచ్లకు హాజరయ్యే ప్రేక్షకులు సెక్యూరిటీ రూల్స్ను ఫాలో అవ్వాలని, ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి దూసుకురావద్దని సూచించాడు. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆతిథ్య దేశం సెక్యూరిటీని పెంచిందని, వారి రూల్స్ను గౌరవించాలన్నాడు.
లేకుంటే ఆతిథ్య దేశం తీసుకునే కఠిన చర్యలకు ఇబ్బంది పడుతారని, ఎవరూ కూడా రక్షించలేరని హెచ్చరించాడు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో టీమిండియా బుధవారం ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

బంగ్లాదేశ్తో వామప్ మ్యాచ్ సందర్భంగా ఓ భారత అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చి రోహిత్ శర్మను హగ్ చేసుకున్నాడు. సదరు అభిమానిని చావబాదిన అమెరికా పోలీసులు.. రోహిత్ శర్మ చెప్పినా.. వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో రోహిత్ శర్మ అభిమానులను హెచ్చరించాడు.
'ఎవరూ కూడా సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకు రాకూడదు. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత చాలా ముఖ్యం. ఆతిథ్య దేశం యొక్క సెక్యూరిటీ రూల్స్ను గౌరవించండి.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ను అడ్డుకుంటామని ఐసీస్ గ్రూప్ నుంచి ఓ పోస్టర్ వెలువడింది. దాంతో అమెరికా పోలీసులు అప్రమత్తమయ్యారు. టీమిండియా ఆటగాళ్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. టీమిండియాలోని ప్రతీ ఆటగాడికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
మైదానం చుట్టూ స్నైపర్లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందని భావిస్తే.. అమెరికా పోలీసులు అభిమానులని కూడా చూడకుండా స్నైపర్లతో షూట్ చేస్తారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ రూల్స్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఫ్యాన్స్కు రోహిత్ శర్మ సూచించాడు.