టీ20 ప్రపంచకప్ 2024 ముందు జరుగనున్న వామప్ మ్యాచ్ను అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు సద్వినియోగం చేసుకుంటామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముందు భారత్..శనివారం బంగ్లాదేశ్తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోతమ సన్నాహకాల గురించి రోహిత్ శర్మ ఐసీసీ వెబ్సైట్తో మాట్లాడాడు.
'టోర్నీ ప్రారంభానికి ముందే మేం ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. అందుకే మాకు వార్మప్ మ్యాచ్ చాలా కీలకం. బ్యాటర్లు, బౌలర్లు తమ లయను అందిపుచ్చుకోవడానికి వీలుంది. జూన్ 5న మేం తొలి మ్యాచ్ ఆడనున్నాం. దానికి సన్నాహకంగా ఈ వార్మప్ మ్యాచ్లను వాడుకుంటాం.

నెట్స్లో తీవ్రంగా సాధన చేశాక న్యూయార్క్ అందాలను వీక్షించే అవకాశం మాకు దక్కింది. ఈ వేదిక కూడా చాలా బాగుంది. ఓపెన్ గ్రౌండ్ ఇలాంటి మైదానంలో ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. తప్పకుండా భారీ ఎత్తున అభిమానులు క్రికెట్ మ్యాచ్లను చూసేందుకు వస్తారని ఆశిస్తున్నా.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వామప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో ఈ మ్యాచ్ను వీక్షించొచ్చు. డిస్నీ-హాట్స్టార్ ఓటీటీలోనూ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.
మరోవైపు భారత్తో జరిగే వామప్ మ్యాచ్ను ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగించుకుంటామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో తెలిపాడు.