టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పాకిస్థాన్తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే తాము ఆధారపడ లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఆదివారం న్యూయార్క్ వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా జట్టు మొత్తం సమష్టిగా రాణించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. 'గుడ్ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. ఇలాంటి క్లిష్టమైన పిచ్ కండిషన్స్లో అత్యుత్తమ నిర్ణయం తీసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. గత మ్యాచ్లానే మా అప్రోచ్ ఉంటుంది.

కోహ్లీపై ఆధారపడం..
మేం ఏ ఒక్కరిపైనా ఆధారపడాలనుకోవడం లేదు. సమష్టిగా రాణించి విజయం సాధించాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ తగిన రీతిలో సన్నదమయ్యాడు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే అనుభవం అతనికి ఉంది. కోహ్లీ అనుభవాన్ని ఏది అధిగమించలేదు. బంగ్లాదేశ్తో వామప్ మ్యాచ్ ఆడకున్నా.. తొలి మ్యాచ్లో ఆశించిన రీతిలో రాణించకపోయినా కోహ్లీ తన అనుభవంతో జట్టుకు అండగా ఉంటాడు.
ప్రపంచకప్ కంటే ఏది ఎక్కువ కాదు..
ఈ కఠిన పిచ్ నుంచి ఎదురయ్యే సవాళ్లను మేం ఎదుర్కొంటాం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి కఠిన సవాళ్లు ఎదురవ్వడం సహజమే. గబ్బా మైదానంలో మేం ఈ తరహా పిచ్పైనా ఆడాం. చాలా దెబ్బలు తాకించుకున్నాం. ప్రపంచకప్ మించినది ఏదీ లేదు. శరీరానికి ఎన్ని దెబ్బలు తాకినా ఏం కాదు.
పాకిస్థాన్తో గతంలో నాలుగేళ్లకు ఒకసారి కాకుండా తరుచూ ఆడుతూనే ఉన్నాం. ప్రతీ ఓవర్కు గేమ్ మారుతూనే ఉంటుంది. న్యూయార్క్ పిచ్పై కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మరీ దూకుడుగా.. నెమ్మదిగా కాకుండా బ్యాటింగ్ చేయాలి. టాపార్డర్లో ఎవరో ఒకరు స్వేచ్చగా ఆడాలి.
తక్కువ అంచనా వేయలేం..
ఇటీవల పాకిస్థాన్ ఫామ్ను చూసి ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. టీ20ల్లో ఆరోజు ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే వారికే విజయం దక్కుతుంది. గత ప్రపంచకప్లో జింబాబ్వే చేతిలో ఓడిన తర్వాత కూడా పాక్ ఫైనల్ చేరింది.
మేం ఎలాంటి వికెట్పై ఆడబోతున్నామో మాకు క్లారిటీ లేదు. పాకిస్థాన్ కంటే ఎక్కువ రోజులు ఇక్కడున్నా కండిషన్స్ను అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. చివరకు పిచ్ క్యూరెటర్ కూడా వికెట్ ఎలా ఉండబోతుందో చెప్పలేకపోతున్నాడంటే పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు.'అని రోహిత్ పేర్కొన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.