టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన తమ ఆఖరి సూపర్-8 పోరులో సమష్టిగా రాణించిన టీమిండియా 24 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-1 టాపర్గా సెమీఫైనల్కు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
బంగ్లాదేశ్పై అఫ్గానిస్థాన్ విజయం సాధిస్తే ఆసీస్ ఇంటిదారి పడుతోంది. ఓడితే రన్రేట్ కీలకం కానుంది. మూడు జట్లలో రన్రేట్ మెరుగ్గా ఉన్న జట్టు గ్రూప్-1 రన్నరప్గా టోర్నీలో ముందడుగు వేయనుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 28)మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
ట్రావిస్ హెడ్ విధ్వంసం..
206 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్(6) వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో వార్నర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్తో కలిసి ట్రావిస్ హెడ్ చెలరేగాడు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు.
అతని ధాటికి ఆస్ట్రేలియా పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. అదే దూకుడు కనబర్చిన ట్రావిస్ హెడ్.. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మలుపు తిప్పిన అక్షర్ పటేల్
81 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ సాయంతో మిచెల్ మార్ష్ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్వెల్(20) భారీ షాట్లతో చెలరేగినా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ వెంటనే మార్కస్ స్టోయినీస్(2)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేశాడు. టీమ్ డేవిడ్(15), మాథ్యూవేడ్(1) అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. ప్యాట్ కమిన్స్(11 నాటౌట్) భారీ సిక్సర్తో చెలరేగినా ఫలితం లేకపోయింది.