టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుండటంపై కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగాలని తాను రాహుల్ ద్రవిడ్ను ఒప్పించే ప్రయత్నం చేశానన్నాడు. కానీ ఆయన అంగీకరించలేదని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియా బుధవారం ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మను టీమిండియా హెడ్ కోచ్గా ఈ టోర్నీతో రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంపై ప్రశ్నించగా భావోద్వేగానికి గురయ్యాడు. రాహుల్ ద్రవిడ్ తనకు పెద్ద రోల్ మోడల్ అని, అతని కోచింగ్ను పూర్తిగా ఆస్వాదించానని తెలిపాడు.

'టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగాలని ద్రవిడ్ను ఒప్పించే ప్రయత్నం చేశాను. కానీ ఆయన సుముఖంగా లేడు. కానీ వ్యక్తిగతంగా నేను ఆయన కోచింగ్ను ఆస్వాదించాను. ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేను. అసలు మేం ఆయన పదవి కాలం ముగియడం గురించే ఆలోచించలేదు.
ఆయనతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. నేను ఆయన సారథ్యంలో ఆడాను. మాకు ఆయన ఓ బిగ్ రోల్ మోడల్. ఆయనేం సాధించాడో మాకు బాగా తెలుసు. కెరీర్లో చాలా ధృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. ఆయనతో ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. ఇప్పటికే బీసీసీఐ తదుపరి టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది.
దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం దరఖాస్తుల విషయాన్ని కూడా వెల్లడించలేదు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు చేశారని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గౌతమ్ గంభీర్ సైతం టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. 'భారత జట్టుకు కోచ్గా పనిచేయడం నాకిష్టం. అంతకు మించిన గౌరవం లేదు. మన జాతీయ జట్టుకు హెడ్ కోచ్గా పనిచేయడం అంటే ఎంతో గౌరవమైన బాధ్యత.
140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం కన్నా మించిన పదవి ఏది లేదు.'అని ఓ కార్యాక్రమంలో గంభీర్ వెల్లడించాడు.