టీ20 ప్రపంచకప్ 2024 ముంగిట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ బరిలోకి దిగితే.. అన్నీ ఎడిషన్ల టీ20 ప్రపంచకప్లు ఆడిన ఏకైక భారత ఆటగాడిగా హిట్మ్యాన్ చరిత్రకెక్కనున్నాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 నుంచి రోహిత్ శర్మ ప్రతీ టీ20 వరల్డ్ కప్ ఆడాడు.
ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. రోహిత్ శర్మ తర్వాత బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. ఈ ఇద్దరూ మాత్రమే ఇప్పటి వరకు ప్రతీ టీ20 ప్రపంచకప్ ఎడిషన్ ఆడారు.

ఈ ఇద్దరూ అరంగేట్ర 2007 టీ20 ప్రపంచకప్తోనే తమ కెరీర్ను ప్రారంభించడం గమనార్హం. విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గత 8 టీ20 ప్రపంచకప్ ఎడిషన్స్లో 34.39 సగటు, 127.88 స్ట్రైక్రేట్తో 963 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి.
షకీబ్ అల్ హసన్ 36 మ్యాచ్ల్లో 23.93 సగటు, 122.44 స్ట్రైక్రేట్తో 742 పరుగులు నమోదు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 47 వికెట్లు తీసి టీ20 ప్రపంచకప్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత షాహిద్ అఫ్రిది 34 మ్యాచ్ల్లో 39 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత్కు సారథ్యం వహించిన రోహిత్ శర్మ.. ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాడు. లీగ్ దశలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. మరోసారి నాకౌట్ పోరులో తడబడింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో ఓడి ఇంటిదారి పట్టింది.
కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ ఆఖరి టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్దమయ్యాడు. అమెరికా వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాను విజేతగా నిలబెట్టేందుకు తనకున్న ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.