టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరినా.. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందంట. ఈ సీజన్ ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో రోహిత్ శర్మ ఆడగా.. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో హిట్ మ్యాన్ సారథ్యంలో స్టార్ ఆల్రౌండర్ ఆడాల్సి ఉంది.
ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. వరుస పరాజయాలతో అందరి కన్నా ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడమే ఆ జట్టు ఆట తీరును దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం రోహిత్ శర్మతో పాటు ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లందరికి ఇష్టం లేదని, దాంతో టీమ్ రెండు గ్రూప్లుగా విడిపోయిందనే ప్రచారం జరిగింది.

మైదానంలోనూ ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమైంది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయంలోనూ ఈ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూచించారని ఓ జాతీయా వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు ఇతర సెలెక్టర్లు వారి సూచనలను పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తాడని పేర్కొంది. ప్రత్యామ్నాయ ఆటగాడు లేకనే హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నామని అజిత్ అగార్కర్ సైతం టీమ్ ప్రకటన సందర్భంగా మీడియాకు చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడితో ఆల్రౌండర్గా తీవ్రంగా నిరాశపరిచాడు. 13 మ్యాచ్ల్లో 200 పరుగులు మాత్రమే చేసిన అతను బౌలింగ్లో 11 వికెట్లే పడగొట్టాడు.
ఇక ముంబై ఇండియన్స్ నుంచి నలుగురు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ప్రపంచకప్కు ఎంపిక చేసిన 15 మంది జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి 29 వరకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.