టీ20 ప్రపంచకప్ 2024లో అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. అనామక జట్లు.. ఏకపక్ష మ్యాచ్లతో విసుగు చెందిన క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజా అందించేందుకు హై ఓల్టేజ్ మ్యాచ్ రెడీ అయ్యింది. మరో 24 గంటల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ బిగ్ మ్యాచ్కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్పై సోషల్ మీడియా వేదికగా చాలా హైప్ క్రియేట్ అయ్యింది.
పసికూన చేతిలో ఓడిన పాకిస్థాన్ ఏమేరకు భారత్కు పోటీనిస్తుందో? అని ఆ దేశ అభిమానులు ఆందోళనకు గురవుతుంటే.. ఐర్లాండ్పై విజయంతో టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. దాయాదుల పోరును ఇరు దేశాల అభిమానులు మైదానంలో జరిగే యుద్దంగానే భావిస్తారు. గెలుపు, ఓటములను తమ దేశాల ప్రతిష్టగా పరిగణిస్తారు.

ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్కు ఇంతటి క్రేజ్. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సన్నదమవుతున్నారు. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్ ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉండటంతో కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. ఏ జట్టు చేతిలో ఓడినా పట్టించుకోని భారత అభిమానులు పాకిస్థాన్ చేతిలో ఓడితే మాత్రం జీర్ణించుకోలేరు.
ఇది భారత ఆటగాళ్లపై అనవసర ఒత్తిడిని తీసుకొస్తుంది. మరోవైపు పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్.. సూపర్-8కు అర్హత సాధించాలంటే భారత్తో గెలవడం చాలా కీలకం. దాంతో ఆ జట్టు ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో రిషభ్ పంత్ షేర్ చేసి ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది.

ఓవైపు ఇరు జట్లు తమ విజయాల కోసం వ్యూహాలు రచిస్తుండగా.. రిషభ్ పంత్ మాత్రం తమదే సునాయస విజయమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.. బిగ్ మ్యాచ్ కోసం సన్నదమవుతున్న పిక్ను షేర్ చేసిన రిషభ్ పంత్.. రోహిత్ శర్మను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. 'ఈజీ భయ్యా ఈజీ'అని వారి ప్రాక్టీస్కు సంబంధించిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. పాక్తో మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్ చేసి సూచనలను ఉద్దేశించిన పంత్ ఈ కామెంట్ చేశాడు.
ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పంత్ అద్భుతంగా రాణించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ తరఫున బరిలోకి దిగిన పంత్.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.