టీ20 ప్రపంచకప్ 2024కు రంగం సిద్దమైంది. మరో 72 గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా.. తుది జట్టు ఎంపికపై కసరత్తులు చేస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు సన్నదమవుతున్నారు.
ఈ మెగా టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయగా.. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. ఘోర రోడ్డు ప్రమాదంతో గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరమైన రిషభ్ పంత్ ఈ మెగా టోర్నీతోనే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

దుమ్మురేపిన పంత్..
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2024 సీజన్తో మైదానంలోకి అడుగుపెట్టాడు. అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, కీపింగ్లో మునపటిలా సత్తా చాటి టీమిండియాకు ఎంపికయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా 13 మ్యాచ్లు ఆడిన రిషభ్ పంత్ 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్గా 11 క్యాచ్లతో పాటు 5 స్టంపౌట్స్ చేశాడు.

సూపర్ ఫామ్లో సంజూ శాంసన్..
మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున నిలకడగా రాణించిన సంజూ శాంసన్.. టీమిండియా పిలుపును అందుకున్నాడు. అతను 16 మ్యాచ్ల్లో 531 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యాడు. అయితే ఈ ఇద్దరిలో తుది జట్టులో ఎవరు ఉంటారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
టీ20 రికార్డ్స్, అంతర్జాతీయ క్రికెటర్ అనుభవం రిషభ్ పంత్కు ఎక్కువగా ఉండటంతో పాటు లెఫ్టాండర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం. అంతేకాకుండా క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం అతని సొంతం. మరోవైపు సంజూ శాంసన్ కూడా తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు.

పంత్కే అవకాశాలు ఎక్కువ..?
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ను పరిగిణలోకి తీసుకుంటే రిషభ్ పంత్ తుది జట్టులో ఉంటాడు. పైగా అతను టాప్-5లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. సంజూ శాంసన్కు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రూపంలో పోటీ నెలకొంది. సూర్యకు ఏమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే మాత్రం రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్ ఇద్దరూ తుది జట్టులో ఉంటారు.