టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జెర్సీలో బరిలోకి దిగిన పంత్.. మునపటిలా స్వేచ్చగా ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 40 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 4 ఫోర్లతో 31) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, మహ్ముదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ తీసారు.

ఈ సన్నాహక మ్యాచ్లో సంజూ శాంసన్(1), రోహిత్ శర్మ(23), శివమ్ దూబే(14) విఫలమయ్యారు. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మంచి సాధికారతతో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. తన్వీర్ ఇస్లామ్ వేసిన 17వ ఓవర్లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. ఫినిషర్గా తన సత్తా ఏంటో చాటి చెప్పాడు.
ఈ సన్నాహక మ్యాచ్కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. శనివారం ఉదయమే జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీకి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చామని రోహిత్ తెలిపాడు. కానీ విరాట్ కోహ్లీ మైదానంలోనే కనిపించాడు. డగౌట్ మ్యాచ్ నుంచి సన్నాహక మ్యాచ్ను పరిశీలించాడు.
ఈ సన్నాహక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన రిషభ్ పంత్ తుది జట్టులో తన చోటును ఖాయం చేసుకున్నాడు. సంజూ శాంసన్ వైఫల్యం పంత్కు కలిసొచ్చింది. ఐర్లాండ్తో జూన్ 5న జరిగే తొలి మ్యాచ్లో రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.