టీమిండియా సెన్సేషన్ రింకూ సింగ్కు టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ షాక్కు గురి చేసింది. ఐపీఎల్ సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి తారాజువ్వలా దూసుకొచ్చిన రింకూ సింగ్.. ఫినిషర్గా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. దాంతో అతను టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో ఉంటాడని అంతా భావించారు.
కానీ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మాత్రం అతనిపై వేటు వేసింది. ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్డ్ ప్లేయర్ల జాబితాలో అతని పేరు చేర్చింది. గతేడాదిగా భారత టీ20 జట్టులో నిలకడగా రాణించిన రింకూ సింగ్ను చివరి నిమిషంలో తప్పించడం అందర్నీ షాక్కు గురిచేసింది. 2019 వన్డే ప్రపంచకప్ ముందు అంబటి రాయుడిని తప్పించిన పరిస్థితులను తలపించింది.

3D ప్లేయరంటూ..
అప్పట్లో రాయుడిని సైతం ఏడాది మొత్తం భారత జట్టులో నాలుగో స్థానంలో ఆడించి.. ఐపీఎల్ 2019లో విఫలమయ్యాడని చివరి నిమిషయంలో 2019 ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు. రింకూ సింగ్లానే స్టాండ్బై లిస్ట్లో చేర్చారు. రాయుడికి బదులు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తాడని విజయ్ శంకర్ను తీసుకున్నారు.
అతను త్రీ డైమన్షల్ ప్లేయర్ అంటూ అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శంకర్ ఆట చూసేందుకు 3డీ గ్లాస్ బుక్ చేశానంటూ అంబటి రాయుడు ట్వీట్ చేయడం సంచలనం రేపింది. విజయ్ శంకర్ గాయంతో టోర్నీ మధ్యలోనే వెనుదిరగ్గా.. భారత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ టోర్నీలో రాయుడి లేని లోటు స్పష్టంగా కనిపించింది.

రింకూ సింగ్ను సైతం..
తాజా టీ20 ప్రపంచకప్కు కూడా సెలెక్టర్లు అదే తరహా తప్పు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా రింకూ సింగ్ను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రింకూ సింగ్ కూడా రాయుడిలానే బౌలింగ్ చేయలేడనే పక్కకు పెట్టినట్లు అర్థమవుతోంది.
ఐపీఎల్ 2023 సీజన్లో సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన రింకూ సింగ్.. 12 మ్యాచ్ల్లో 262 పరుగులతో సత్తా చాటాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో అతను 9 మ్యాచ్ల్లో 123 పరుగులే చేశాడు. దాంతోనే అతన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.