T20 World Cup 2024: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలుస్తుందని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమిండియా కేంద్రంగా మారిందని తెలిపాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి శాస్త్రి టీమిండియా ప్రపంచకప్ ప్రదర్శనను విశ్లేషించాడు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన బాధ ఇప్పటికీ వెంటాడుతుందని తెలిపాడు. 'వన్డే ప్రపంచకప్ ఓటమి హృదయాన్ని ముక్కలు చేసింది. మనం కప్పు గెలవలేకపోయామే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే మనది టోర్నీలో అత్యంత బలమైన జట్టు. సచిన్ లాంటి గొప్ప ఆటగాడు కూడా ప్రపంచకప్ కోసం ఆరో టీర్నీ దాకా ఎదురు చూశాడు.

ప్రపంచకప్ గెలవడం అంత సులువైన పనికాదు. ఆ కీలకమైన రోజు గొప్పగా ఆడాల్సి ఉంటుంది. అయితే జట్టులోని కుర్రాళ్లు త్వరగా నేర్చుకుంటారు. ఆట సాగుతూనే ఉంటుంది. అతి త్వరలోనే భారత్ ప్రపంచకప్ గెలవడం చూస్తా. అది 50 ఓవర్లలో కాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో జట్టును పునర్నిర్మంచడానికి సమయం పడుతుంది. దాని మీద ఫోకస్ పెట్టాలి.
కానీ వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో భారత్ గట్టి పోటీదారు. ఎంతో మంది ప్రతిభావంతులకు భారత్ కేంద్రంగా మారింది.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రోహిత్ సేన.. కీలక ఫైనల్లో ఓటమిపాలైంది. వరుసగా 10 విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్ చేజార్చుకుంది. వన్డే ప్రపంచకప్ ముగియడంతో టీమిండియా టీ20 ప్రపంచకప్పై ఫోకస్ పెట్టింది.
వచ్చే ఏడాది జూన్లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ పొట్టి కప్ కోసం టీమిండియా ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమ్ కాంబినేషన్పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. సిరీస్పై కన్నేసింది.