టీ20 ప్రపంచకప్ 2024లో కీలక దశ అయిన సూపర్ 8 మ్యాచ్లు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సూపర్ 8 మ్యాచ్లకు వెస్టిండీస్లోని నాలుగు వేదికలు బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
అయితే ఈ సూపర్ 8 మ్యాచ్లకు ముందు అక్కడి వాతావరణ శాఖ రిపోర్ట్స్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(సీడబ్ల్యూఐ)ను కలవరపెడుతున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చేయుతనిచ్చేందుకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను ఇచ్చింది.

వరుణ గండం..
ఈ టోర్నీ నిర్వహణ ద్వారా తమ ఆర్థిక సమస్యలు తీరుతాయని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ వారి ఆశలపై వరుణుడు నీళ్లు జల్లనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లోని సూపర్ 8 మ్యాచ్లన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
జూన్ 20న భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరిగే ఒక్క మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించనుంది. బార్బోడోస్ స్టేడియం వేదికగా గురువారం భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సమయంలో 10 నుంచి 15 శాతం వర్షం పడనుంది.
55 శాతం వర్షం పడే ఛాన్స్..
ఈ స్టేడియంలో జరిగే ఇతర మ్యాచ్ల సమయంలో 40 నుంచి 55 శాతం వర్షం పడే అవకాశం ఉంది. సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మైదానంలో జరిగే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.
సెయింట్ విన్సెంట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మైదానంలో మ్యాచ్లు జరిగే సమయంలో 52 శాతం వర్షం కురవనుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఆంటిగ్వా స్డేడియం వేదికగా జరిగే మ్యాచ్ సమయంలోనూ 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. సూపర్8లో దాదాపు 80 శాతం మ్యాచ్లపై వర్షం ప్రభావం ఉండనుంది.
మూడు మ్యాచ్లు రద్దు..
ఈ క్రమంలోనే ఐసీసీ కలవరపాటుకు గురవుతోంది. ఇప్పటికే గ్రూప్ దశలో కొన్ని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. భారత్ వర్సెస్ కెనడా, ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్, యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. వర్షం కారణంగా పాకిస్థాన్ టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది.
వర్షం పడే సమయంలో పిచ్ను కవర్లతో కప్పేస్తున్నా.. ఔట్ ఫీల్డ్ను కవర్ చేసే కవర్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వద్ద లేకపోవడం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారింది.
కవర్స్ లేకపోవడంతో..
వర్షం వెలిసినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారుతుండటంతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ సాయం చేయాలని, వర్షం ప్రభావం ఉండకుండా మైదానం మొత్తానికి కావాల్సిన కవర్లను ఏర్పాటు చేయాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
సూపర్-8 మ్యాచ్లపై వర్షం ప్రభావం చూపితే నాకౌట్ చేరే జట్లు తారుమారయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించనున్నారు. ఇలాంటి పరిస్థితే వస్తే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి ప్రధాన జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతినన్నున్నాయి.