టీ20 ప్రపంచకప్ 2024 కోసం వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ కారణంగా ఆలస్యంగా వెళ్లిన ప్యాట్ కమిన్స్, గ్లేన్ మ్యాక్స్వెల్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్యాట్ కమిన్స్ లగేజీ మాయమవ్వగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్వెల్ అనూహ్య కారణాలతో వారి ప్రయాణం ఆలస్యమైంది. దాంతో వారు విమానాశ్రయాల్లోనే గడపాల్సి వచ్చింది. ఆటగాళ్ల ఆలస్య ప్రయాణాలు జట్టు సన్నాహకాలపై ప్రభావం చూపాయి.

ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించిన కమిన్స్.. కేకేఆర్తో ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వెంటనే స్వదేశానికి వెళ్లిపోయాడు. అక్కడ తమ కుటుంబ సభ్యులతో గడిపిన అతను.. ప్రపంచకప్ కోసం బార్బోడస్కు వచ్చాడు. అయితే అక్కడ అతని లగేజీ మిస్సయ్యింది.
ఆ తర్వాత అధికారులు స్పందించి లగేజీ తెచ్చివ్వడంతో కమిన్స్ రెండు రోజులు ఆలస్యంగా ఆసీస్ జట్టుతో కలిసాడు. ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించిన మిచెల్ స్టార్క్, ఆర్సీబీకి ఆడిన మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి బార్బోడస్ బయల్దేరగా.. అనివార్య కారణాలతో లాస్ ఏంజెల్స్, మియామిలో రాత్రంతా గడిపారు.
ఈ ఆలస్య ప్రయణాలు కమిన్స్, మ్యాక్స్వెల్, స్టార్క్లను వామప్ మ్యాచ్ ఆడకుండా చేశాయి. కీలక ప్రపంచకప్ ముందు ఆసీస్ సన్నాహకాలను దెబ్బతీసాయి. మార్కస్ స్టోయినిస్ క్రికెట్ కిట్ మిస్సవ్వడంతో అతను వెస్టిండీస్తో జరిగిన వామప్ మ్యాచ్ ఆడలేదు. ఆటగాళ్ల గైర్హాజరీ కారణంగా నమీబియాతో జరిగిన వామప్ మ్యాచ్లో ఆసీస్ సపోర్ట్ స్టాఫ్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
చీఫ్ సెలెక్టర్ జార్జ్ బైలీ, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డోనాల్డ్, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా బరిలోకి దిగారు. ప్రయాణ సమస్యలను ఎదుర్కొని మొత్తానికి ఒక దగ్గరకు చేరిన ఆస్ట్రేలియా.. ప్రాక్టీస్ లేమితో ఇబ్బంది పడుతోంది. ఓమన్తో గురువారం జరిగే మ్యాచ్తో ఆస్ట్రేలియా తమ ప్రపంచకప్ క్యాంపైన్ను ప్రారంభించనుంది.
6 నెలల క్రితం భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా అదే జోరును కనబర్చి టీ20 ప్రపంచకప్ను గెలవాలనుకుంటోంది.