T20 World Cup 2024 టోర్నీకి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పరాజయం అనంతరం ఆటకు దూరమైన కోహ్లీ.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో లండన్లో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు.
సౌతాఫ్రికా పర్యటనలోని వైట్ బాల్ సిరీస్కు కూడా అందుబాటులోకి రాలేదు. రెండు టెస్ట్ల సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీకి విరాట్ కోహ్లీని పక్కనపెట్టాలని భారత సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వన్డే ప్రపంచకప్ 2023లో అద్భుత బ్యాటింగ్తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినా.. టీ20ల్లో ఐపీఎల్లో అద్భుత రికార్డులున్నా.. టీ20 ఫార్మాట్కు కోహ్లీని పక్కనపెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు దైనిక్ జాగరన్ పత్రిక పేర్కొంది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ టీ20 భవితవ్యంపై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
విరాట్ కోహ్లీకి బదులు లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలిపింది. తొలి బంతి నుంచే అటాకింగ్ చేయగల ఇషాన్ కిషన్ను మిడిలార్డర్లో ఆడిస్తే జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, కోహ్లీలా నెమ్మదిగా ఆడితే జట్టుకు నష్టం చేస్తుందనేది టీమిండియా మేనేజ్మెంట్ వాదన.

అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు విరాట్ కోహ్లీతో సంప్రదిస్తారని కూడా సదరు పత్రిక పేర్కొంది. మాజీ క్రికెటర్లు మాత్రం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ 2024 ఆడాలని సూచిస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్లు ఆడే కోహ్లీ జట్టులో ఉంటే.. ప్రత్యర్థులకు భయం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
అతను కుర్రాళ్లకు ఓ గైడెన్స్లా కూడా ఉంటాడని, కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడని తెలుపుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ చూస్తేనే అతని అవసరం ఏంటో తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.