టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నాసౌ కౌంటీ స్టేడియం వేదికగా ఆతిథ్య అమెరికా (USA)తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది. ఐర్లాండ్, పాకిస్థాన్పై విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
మరోవైపు యూఎస్ఏ కూడా పాకిస్థాన్, కెనడాను ఓడించి మరో సంచలన విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్-8కు అర్హత సాధించనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం పాకిస్థాన్ సూపర్ 8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు స్టార్ ఆటగాళ్లు డుమ్మా కొట్టారు. పలువురి ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పడంతో చాలా మంది ఆటగాళ్లు హోటల్ గదిలకే పరిమితమయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ చేయలేదు.
ఇక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లతో పాటు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా మేనేజ్మెంట్ నేటి ప్రాక్టీస్ సెషన్ నుంచి విశ్రాంతి కల్పించింది. మిగతా ఆటగాళ్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, చాహల్, కుల్దీప్ యాదవ్లతో పాటు తదితర ఆటగాళ్లు నెట్స్లో చెమటోడ్చారు.
అమెరికా జట్టు మంగళవారం ప్రాక్టీస్ కూడా చేయలేదు. అయితే టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉండటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పసికూన అని లైట్ తీస్కుంటే పాకిస్థాన్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఆ తర్వాత భారత్తో గత ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది.
వరుస పరాజయాలతో సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయాలంటే అమెరికా తమ చివరి రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడాలి. మరోవైపు పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్లను భారీ రన్రేట్తో విజయం సాధించాలి.