టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. జూన్ 1న అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. జట్లను ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మే1ని డెడ్లైన్ విధించడంతో అన్నీ టీమ్స్ తమ జట్ల వివరాలను వెల్లడించాయి.
దాంతో నెలరోజుల ముందుగానే టీ20 ప్రపంచకప్ సందడి మొదలైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారమే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సంచలనాలకు ఏ మాత్రం చోటివ్వని బీసీసీఐ.. అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. భారత జట్టులో ఉంటాడనుకున్న రింకూ సింగ్ను రిజ్వర్ ప్లేయర్గా తీసుకుంది.

అతనితో పాటు శుభ్మన్ గిల్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ను విస్మరించిన సెలెక్టర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్లను వికెట్ కీపర్లుగా తీసుకున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టీమ్స్ కూడా తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రపంచకప్కు సంబంధించిన తన అంచనాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాత్రమే సెమీఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు. భారత్, పాకిస్థాన్తో పాటు మరే జట్టు కూడా నాకౌట్ చేరదని అభిప్రాయపడ్డాడు.
'నా అంచనా ప్రకారం టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరే నాలుగు జట్లు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్'అని ట్వీట్ చేశాడు. అయితే మైఖేల్ వాన్ ప్రిడిక్షన్ ఎప్పుడూ నిజం కాలేదని, వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్, పాకిస్థాన్ ఫైనల్ చేరుతాయని చెప్పాడని, కానీ భారత్, సౌతాఫ్రికా మాత్రమే సెమీఫైనల్ చేరాయి. మైఖేల్ వాన్ చెప్పని ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. ఈ సారి భారత్ టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.