టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్రౌండర్ పాత్ర పోషించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్గా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. 2007 టీ20 ప్రపంచకప్లో సత్తా చాటాడు. తన బ్యాటింగ్, బౌలింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కోచ్లు, మెడికల్ టీమ్ సూచనల మేరకు చాలా రోజు క్రితమే బౌలింగ్ వేయడం మానేసిన రోహిత్ శర్మ.. మరోసారి బౌలింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. కెరీర్ చివరి దశలో ఉన్న హిట్ మ్యాన్ టీ20 ప్రపంచకప్ 2024లో జట్టుకు అవసరమైతే ఆఫ్ స్పిన్నర్గా సేవలందిస్తానని తెలిపాడు.

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును సెలెక్టర్లు గత మంగళవారం ప్రకటించారు. ఈ జట్టు ప్రకటన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రపంచకప్ జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడనే విషయాన్ని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. అజిత్ అగార్కర్.. కెప్టెన్ రోహిత్ శర్మను సూచించాడు. ఆఫ్ స్పిన్ వేసేందుకు తాను ఎప్పుడూ సిద్దమేనని రోహిత్ శర్మ కూడా తెలిపాడు.
జట్టులోకి నలుగురు స్పిన్నర్లు తీసుకున్నారు. కానీ అందులో ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేడు కదా? అని సదరు మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. రోహిత్ శర్మ ఆ బాధ్యతలు మోస్తాడని అజిత్ అగార్కర్ నవ్వుతూ చెప్పాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ నేను సిద్దమంటూ చేయి ఎత్తాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇక మిడిలార్డర్ బలాన్ని పెంచాలనే శివమ్ దూబేను తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐపీఎల్తో పాటు అంతకుముందు భారత్ తరఫున అతను కనబర్చిన ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశామని చెప్పాడు.
అయితే తుది జట్టులో ఆడుతాడనే గ్యారంటీ లేదని, అక్కడి పిచ్ కండిషన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలనుకున్నానని, ఇప్పుడు అందుకు గల కారణాన్ని చెప్పలేనని రోహిత్ స్పష్టం చేశాడు. నలుగురు స్పిన్నర్ల వెనుక ఉన్న వ్యూహాన్ని అమెరికాలోనే చెబుతానని సమాధానమిచ్చాడు.
ఇక విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్కు సంబంధించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని, అతను అద్భుతంగా ఆడుతున్నాడని, అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అగార్కర్ అన్నాడు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్