టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఛీటింగ్ చేసి సెమీఫైనల్కు చేరిందన్నాడు. రివర్స్ స్వింగ్ కోసం భారత పేసర్లు బాల్ ట్యాపరింగ్కు పాల్పడ్డారని, అంపైర్లు కళ్లు తెరిచి చూడాలన్నాడు.
టీ20 ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో సెమీస్ చేరిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్థాన్, ఐర్లాండ్ను మట్టికరిపించిన టీమిండియా.. సూపర్-8లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.

తాజాగా ఓ టీవీ ఛానెల్లో భారత జైత్రయాత్రపై స్పందించిన ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత పేసర్లు బాల్ ట్యాంపారింగ్కు పాల్పడ్డారని ఆరోపించాడు.
భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్లోనే అర్ష్దీప్ సింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టాడని, అలా రివర్స్ స్వింగ్ కావాలంటే బంతిని 12, 13వ ఓవర్లోనే టాంపరింగ్ చేసి ఉండాలని చెప్పాడు. బంతి ఆకారాన్ని దెబ్బతీస్తుంటే అంపైర్లు ఏం చేశారో అర్థం కావడం లేదని, వాళ్లు తమ కళ్లను తెరవాల్సిన అవసరం ఉందని ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు.

మరో పాక్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ కూడా ఇంజమామ్ వ్యాఖ్యలతో ఏకీ భవించాడు. 15వ ఓవర్లోనే పాకిస్థాన్ పేసర్లు రివర్స్ స్వింగ్ చేసి ఉంటే పెద్ద చర్చ జరిగేదని, కొన్ని టీమ్స్ విషయంలో అంపైర్ల కళ్లు పనిచేయవని చెప్పుకొచ్చాడు. అర్ష్దీప్ సింగ్ టాంపారింగ్ చేశాడని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీటింగ్ చేయాల్సిన కర్మ టీమిండియాకు లేదని కామెంట్ చేస్తున్నారు.