భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అందరూ ఊహించినట్లుగానే టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ను వరణుడు మింగేసాడు. షెడ్యూల్ ప్రకారం శనివారం లాడర్హిల్ వేదికగా జరగాల్సిన భారత్ వర్సెస్ కెనడా మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పలు దఫాల్లో మైదానాన్ని పరిశీలించినా.. ఆటకు అనువుగా లేకపోవడంతో అంపైర్లు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దాంతో 7 పాయింట్లతో గ్రూప్ ఏ టాపర్గా నిలిచిన భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది.

ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కెనడా గ్రూప్-ఏ నుంచి రెండో జట్టుగా సూపర్ 8 చేరింది. కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇప్పటికే లాడర్హిల్ వేదికగా జరగాల్సిన మూడు మ్యాచ్లు వర్షం కారణంగానే రద్దయ్యాయి. నేపాల్ వర్సెస్ శ్రీలంక, యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్, కెనడా వర్సెస్ ఇండియా మ్యాచ్లు ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి.
ఆదివారం ఇదే వేదికపై పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కూడా జరిగేది అనుమానంగా మారింది. దాంతో ఈ వేదికను ఎందుకు ఖరారు చేశారని ఫ్యాన్స్ ఐసీసీని నిలదీస్తున్నారు.
ఇక సూపర్-8 బరిలోకి దిగే ఎనిమిది జట్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజించనున్నారు. అయితే లీగ్ స్టేజ్లో గ్రూప్లో నిలిచిన టాప్ ర్యాంకుల ఆధారంగా జట్లను ఐసీసీ వేరు చేయట్లేదు. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఐసీసీ సీడింగ్ చేసింది. అంటే సూపర్-8లో ఏ గ్రూప్లో ఏఏ దేశాలు ఉండాలో ముందుగానే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారత్ బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది.
గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరేట్ టీమ్స్తో సూపర్-8ను రెండు గ్రూప్లుగా విభజించింది. వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకునే జట్లను ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది. గ్రూప్-1లో భారత్ (A1), ఆస్ట్రేలియా (B2), న్యూజిలాండ్ (C1), శ్రీలంక (D2)ను ఉంచింది. అలాగే గ్రూప్-2లో పాకిస్థాన్ (A2), ఇంగ్లండ్ (B1), వెస్టిండీస్ (C2), సౌతాఫ్రికా (D1)ను ఎంపిక చేసింది.
కానీ అనూహ్యంగా గ్రూప్-1లో C1గా భావించిన న్యూజిలాండ్, D2గా అనుకున్న శ్రీలంక లీగ్ స్టేజ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వాళ్ల స్థానంలో అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ (అంచనా)తో భారత్ సూపర్-8లో పోటీపడాల్సి వస్తుంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భారత్ షెడ్యూల్
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్- బార్బడోస్ (రాత్రి 8 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- ఆంటిగ్వా (రాత్రి 8 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- లూసియా (రాత్రి 8 గంటలకు)