టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో గురువారం అర్థరాత్రి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై భారత్ స్పిన్నర్లు అక్షర్ పటేల్(3/23), కుల్దీప్ యాదవ్(3/19) రఫ్ఫాడించడంతో భారత్ భారీ విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57)హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47), హార్దిక్ పాండ్యా(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23) దూకుడుగా ఆడారు.

సూర్యతో కలిసి రోహిత్ శర్మ మూడో వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్(19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫిల్ సాల్ట్(5), మోయిన్ అలీ(8), జానీ బెయిర్ స్టో(0), సామ్ కరణ్(2), లియామ్ లివింగ్ స్టోన్(11), క్రిస్ జోర్డాన్(1) తీవ్రంగా నిరాశపరిచారు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఇంగ్లండ్పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. గత టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలోనే టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. శనివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
అఫ్గాన్పై భారీ విజయం సాధించి ఫైనల్ చేరిన సౌతాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్ను ముద్దాడేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు 11 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది.