టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆవిష్కరించింది. జెర్సీ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను సోమవారం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ధర్మశాల మైదానంలో జెర్సీ ఆవిష్కరణకు సంబంధించి బీసీసీఐ స్పెషల్ వీడియోను రూపొందించింది.
ఈ జెర్సీ ఆవిష్కరణ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఉన్నారు. టీమిండియా జెర్సీలో మైదానంలో ఉన్న వీళ్లు.. హెలీకాప్టర్ శబ్దం విని పైకి చూడగా.. టీమిండియా జెర్సీ కనిపిస్తున్నట్లు ఈ వీడియోను క్రియేట్ చేశారు.

అచ్చం 2019 వన్డే ప్రపంచకప్ తరహాలోనే తాజా జెర్సీ ఉంది. బ్లూ, ఆరెంజ్ కలర్స్తో కలిపి ఉన్న ఈ జెర్సీ కాలర్పై భారత జెండా కలర్స్ ఉన్నాయి. భుజాలపై అడిడాస్ స్ట్రిప్స్ ఉండగా.. చెస్ట్పై బీసీసీఐ సింబల్తో పాటు ఒక స్టార్ ఉంది. 2007 టీ20 ప్రపంచకప్ విజయం సూచికగా ఈ స్టార్ను పెట్టారు. ఈ టీ20 ప్రపంచకప్ జెర్సీ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. జెర్సీ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఈ టీ20 ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ పాకిస్థాన్, ఐర్లాండ్, కెనాడాతో పాటు అమెరికాతో తలపడనుంది. భారత్ తన తొలి మ్యాచ్ను ఐర్లాండ్తో జూన్ 5న న్యూయార్క్ వేదికగా తలపడనుంది. జూన్ 9న దాయాదీ పాకిస్థాన్తో న్యూయార్క్ వేదికగానే అమీతుమీ తేల్చుకోనుంది.
ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన మ్యాచ్లు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాళ్లకు కావాల్సిన విశ్రాంతి లభించనుంది. మే 26న ఐపీఎల్ 2024 ఫైనల్ జరగనుంది. ప్లే ఆఫ్స్ చేరని జట్లలోని ఆటగాళ్లతో టీమిండియా స్పెషల్ క్యాంప్ నిర్వహించే అవకాశం ఉంది.
జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది. లీగ్ దశలో టాప్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్ -8లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి జట్లు నాకౌట్ మ్యాచ్లు ఆడుతాయి.