టీ20 ప్రపంచకప్ 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం కలకలం రేపింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కెన్యా మాజీ క్రికెటర్ ఒకరు ఉగాండా ప్లేయర్ను సంప్రదించాడనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయాన్ని ఉగాండా ఆటగాడు వెంటనే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గయానా వేదికగా ఉగాండా మూడు లీగ్ మ్యాచ్లు ఆడింది. అయితే ఈ మ్యాచ్ల్లో ఫిక్సింగ్ చేయాలని కెన్యా మాజీ పేసర్ పలుమార్లు వేర్వేరు నంబర్లతో ఉగాండా ప్లేయర్ను సంప్రదించాడట. ఈ విషయాన్ని ఐసీసీకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలియజేశాడు. అయితే సదరు ఆటగాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు.

'ఫిక్సింగ్ చేయాలనుకున్న వ్యక్తి ఉగాండా ఆటగాడిని టార్గెట్ చేయడంలో ఎలాంటి ఆశ్చర్యపోనవసరం లేదు. పెద్ద జట్ల ఆటగాళ్లతో పోలిస్తే అసోసియేట్ దేశాల ప్లేయర్స్ను వలలో వేసుకోవడం సులువు. కానీ ఉగాండా ఆటగాడు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేసి మంచి పని చేశాడు.
ఈ ఘటనపై విచారణ చేపడతాం'అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీ20 ప్రపంచకప్లో గ్రూప్ సీలో ఉన్న ఉగాండా.. నాలుగు మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించింది.