టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులో కీలక మార్పు చేయాలని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించాలని చెప్పాడు. జడేజా కంటే అక్షర్ పటేల్తోనే జట్టుకు మంచి సమతూకం రావడంతో పాటు స్థిరత్వం వస్తుందని చెప్పాడు.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇవ్వగా.. అతను విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లోనూ జట్టుకు కావాల్సినప్పుడల్లా వికెట్ తీసాడు. జడేజా కంటే అక్షర్ పటేలే మెరుగైన ప్రదర్శన చేశాడు. గత మూడు మ్యాచ్ల్లో 13 సగటుతో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసాడు.

అతని బౌలింగ్ ఎకానమీ 6.50. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మరోవైపు జడేజా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. బౌలింగ్లోనూ జడేజా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.
ఈ క్రమంలోనే అక్షర్ పటేల్పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. జడేజా కంటే అక్షర్ పటేల్ ఎక్కువ ప్రభావం చూపగలడని చెప్పాడు. అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన పఠాన్.. జడేజాతో పోల్చితే అక్షర్ పటేల్ ఎంతో నయమని చెప్పాడు.
'జడేజాతో అక్షర్ పటేల్ను పోల్చితే బ్యాటింగ్ సామర్థ్యంలో పటేల్ రేంజ్ వేరు. ఈ అడ్వాంటేజ్ను టీమిండియా వాడుకోవాలి. బ్యాటింగ్ విషయంలో అతను నంబర్ 4 నుంచి 8 వరకు ఎక్కడైనా ఆడగలడు. రవీంద్ర జడేజా కంటే ఎంతో మెరుగ్గా రాణించగలడు. అంతేకాకుండా జడేజా కంటే అక్షర్ పటేల్ టీమిండియాకు స్థిరత్వం ఇవ్వగలడు.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా మేనేజ్మెంట్ కూడా జడేజా కంటే అక్షర్ పటేల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
'టీమిండియా కూడా జడేజాతో ఎక్కువ బౌలింగ్ చేయించడం లేదు. పటేల్నే తమ స్పిన్ ఆల్రౌండర్గా పరిగణిస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్లో అక్షర్ పటేల్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపించింది. ఈ నిర్ణయాలను చూస్తుంటే టీమిండియా మేనేజ్మెంట్ కూడా జడేజా కంటే అక్షర్ పటేల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
అమెరికా వేదికగా లీగ్ మ్యాచ్ ఆడిన టీమిండియా.. సూపర్ 8 మ్యాచ్లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. స్పిన్కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్ పిచ్లపై టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జడేజా, అక్షర్ పటేల్లో ఒకరు బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జడేజాకు బదులు అక్షర్ పటేల్ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్, జడేజా సూచించారు.