11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా తెరదించింది. సంచలన ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను సొంతం చేసుకుంది. సౌతాఫ్రికాతో శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగల తేడాతో గెలుపొందింది. జస్ప్రీత్ బుమ్రా(2/18) అసాధారణ ప్రదర్శన టీమిండియాను విజేతగా నిలబెట్టింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.
నిప్పులు చెరిగిన బుమ్రా..
177 పరుగుల లక్ష్యచేధనలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రీజా హెండ్రిక్స్ను బుమ్రా(4) స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే అర్ష్దీప్ సింగ్ కీపర్ క్యాచ్గా మార్క్రమ్(4)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 12 పరుగులకే సౌతాఫ్రికా 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు.
క్లాసెన్ విధ్వంసం..
58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. స్టబ్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ తనదైన శైలిలో చెలరేగాడు. క్వింటన్ డికాక్ను అర్ష్దీప్ సింగ్ ఔట్ చేసినా.. క్లాసెన్ భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన ప్రతాపం చూపించాడు. ఈ క్రమంలో అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
మలుపు తిప్పిన బుమ్రా..
18వ ఓవర్లో బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో మార్కో జాన్సెన్(2)ను క్లీన్ బౌల్డ్ చేసి 2 పరుగులే ఇచ్చాడు. దాంతో చివరి 12 బంతుల్లో సఫారీ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ 4 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి వచ్చింది. తొలి బంతికి సూర్య సూపర్ క్యాచ్తో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు. ఐదో బంతికి కగిసో రబడా కూడా ఔటవ్వడంతో టీమిండియా విజయం లాంఛనమైంది.