టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ ప్రశంసల జల్లు కురిపించాడు. నిలకడగా యార్కర్లు సంధించే ఏకైక బౌలర్ జస్ప్రీత్ బుమ్రానేనని కొనియాడాడు. టీ20 ప్రపంచకప్లో బుమ్రాను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టమేనని అభిప్రాయపడ్డాడు. డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ పదను మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ షోలో మాట్లాడిన బ్రెట్ లీ.. బుమ్రా బౌలింగ్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇటీవల కాలంలో బుమ్రాలా నిలకడగా యార్కర్లు వేసే బౌలర్లు కనిపించడం లేదు. అతనిలా ఇతర బౌలర్లు కూడా యార్కర్లు వేయడం చూడాలని ఉంది. కొందరు వేస్తున్నారు కానీ డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా వేయలేకపోతున్నారు.

తాజా ఐపీఎల్ సీజన్లో చాలా సార్లు 200 ప్లస్ రన్స్ నమోదయ్యాయి. పేసర్లు ఇంకాస్త వైవిధ్యంగా బంతులేయడం అలవాటు చేసుకోవాలి. స్కూప్ షాట్లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించుకునే బ్యాటర్లను కట్టడి చేయాలంటే యార్కర్లే కీలకం. వికెట్ల వెనుక, థర్డ్ మ్యాన్ దిశగా ఫీల్డర్లను పెట్టి అప్పుడు ఆ బంతిని వేస్తే.. షాట్ కొట్టేందుకు బ్యాటర్లు భయపడుతారు.
గతంలో 180 నుంచి 200 కొడితే చాలా మంచి స్కోర్లుగా భావించేవాళ్లం. ఇప్పుడు మాత్రం 260 ప్లస్ కొట్టినా గెలిచేవరకూ నమ్మకం ఉండటం లేదు. అందుకే బ్యాటింగ్కు బౌలింగ్కు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. టీ20 ప్రపంచకప్లో బుమ్రాను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు బిగ్ ఛాలెంజ్. టీ20 ప్రపంచకప్ జరిగే వేదికలు బుమ్రా బౌలింగ్కు సరిగ్గా సరిపోతాయి.'అని బ్రెట్లీ చెప్పుకొచ్చాడు.
జూన్ 2న అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్కు తెరలేవనుండగా.. జూన్ 5న ఐర్లాండ్తో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.