టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం న్యూయార్క్లోని నాసౌ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో ఆతిథ్య అమెరికాతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇదే వేదికపై జరిగిన గత రెండు మ్యాచ్ల్లో టీమిండియా అద్భుత విజయాలను అందుకుంది.
తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించిన టీమిండియా.. గత ఆదివారం పాకిస్థాన్పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని అసాధారణ విజయాన్నందుకుంది. అయితే అమెరికాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సలహా ఇచ్చాడు.

పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న శివమ్ దూబేను తుది జట్టులో నుంచి తప్పించాలన్నాడు. అతని స్థానంలో సంజూ శాంసన్ను ఆడించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. 'శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్ను ఆడించాలి. ఇది నా మనసులో నుంచి చెబుతున్న మాట'అని రాయుడు పేర్కొన్నాడు.
సహజంగా రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను విమర్శించడు. కానీ శివమ్ దూబే దారుణంగా విఫలమవడంతో అతన్ని తప్పించాలని సూచించాడు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న శివమ్ దూబే.. బౌలింగ్ కూడా వేయగలడని భావించిన టీమిండియా మేనేజ్మెంట్.. బిగ్ హిట్టర్ రింకూ సింగ్ను పక్కనపెట్టి మరీ జట్టులోకి తీసుకుంది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఐర్లాండ్తో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. పాకిస్థాన్తో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. 9 బంతుల్లో 3 పరుగులే చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. హ్యారీస్ రౌఫ్ బౌలింగ్లో డిఫెండ్స్ చేయబోయి షార్ట్ కవర్ ఫీల్డర్ మహమ్మద్ అమీర్ చేతికి చిక్కాడు. అమెరికాతో జరిగే తదుపరి పోరులో శివమ్ దూబేపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.